ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ స్ధానానికి కూటమి అభ్యర్ధిగా ఎంపికైన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు పాక వెంకట సత్యనారాయణ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ వేయడానికి మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు వచ్చిన పాకా సత్యనారాయణ నామినేషన్ వేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభకు ఎంపికైనందుకు బీజేపీ నేత పాకా సత్యనారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. సీయం చంద్రబాబుతో బీజేపీ నేత పాకా కుటుంబ సభ్యులు ఫొటోలు దిగారు. తనను రాజ్యసభకు ఎంపిక చేయడంతో సహకరించినందుకు ముఖ్యమంత్రికి పాకా సత్యనారాయణ ధన్యవాదాలు తెలియజేశారు. పాకా సత్యనారాయణతో పాటు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు, పార్థసారధి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఈశ్వరరావు, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ(ఆర్గనైజేషన్) తదితరులు ముఖ్యమంత్రిని కలసినవారిలో ఉన్నారు.
- Advertisement with us -