- ఎయిర్ టెల్, జియోలు, స్పేస్ ఎక్స్ తో ఒప్పందం
- ఇకపై స్టార్ లింక్ సేవలు అందుబాటులో
- బిజినెస్ కస్టమర్లు, స్కూళ్లు, కమ్యూనిటీలకు ఉపయోగం
- ఇప్పటికీ మనదేశంలో మొబైల్ టవర్ల ఏర్పాటుకు అడ్డంకులు
- లాజిస్టికల్ సమస్యలతో దూర ప్రాంతాలకు నో సిగ్నల్, ఇంటర్నెట్
- స్టార్ లింక్ శాటిలైట్ సేవలతో ఇకపై గ్రామాలకు సైతం
- హై స్పీడ్ ఇంటర్నెట్ వ్యవస్థ అందుబాటులోకి
- భూటన్ మినహా ఏ పొరుగు దేశానికీ లేని స్టార్ లింక్ సదుపాయం
- నెలకు రూ. 4,200 కడితే 25-100 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్
- టెలికాం రంగాన్ని కొల్ల గొట్టనున్న స్టార్ లింక్
- మస్క్ బిజినెస్ హబ్ గా భారత్
ప్రధాని మోడీని అమెరికాలో బిలియనీర్ ఎలన్ మస్క్ కలసిన తర్వాత మన దేశంలో పరిణామాలు వేగంగా కదులుతున్నాయి. మనదేశంలోకి హై స్పీడ్ ఇంటర్నెట్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఎయిర్ టెల్, జియోలు స్టార్ లింక్ తో ఒప్పందం చేసుకున్నాయి. భారతీ ఎయిర్ టెల్ దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన చేసింది.స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, పరిశోధనలు రంగాల్లో పరస్పర సహకార ఒప్పందాలు జరిగిన నేపధ్యంలో స్టార్ లింక్ సేవలు మన దేశంలో విస్తరించబోతున్నాయి.
స్టార్ లింక్ పరికరాలు ఎయిర్ టెల్ స్టోర్ లలో..
ఎయిర్ టెల్ రిటైల్ స్టోర్లలో స్టార్ లింక్ పరికరాలు అమ్ముతారు. బిజినెస్ కస్టమర్లకు ఈ సేవలు బాగా ఉపయోగపడతాయి. స్టార్ లింక్ వయాఎయిర్ టెల్ ద్వారా తన సేవలు అందిస్తుంది. ఇది స్కూళ్లు, కాలేజీలు,హెల్త్ సెంటర్లు, ఇతర కమ్యూనిటీలు ఒకరికొకరు కనెక్ట్ అవడానికి ఈ సర్వీసులు ఉపయోగపడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో సుదూర ప్రాంతాలను సైతం ఇది సునాయాసంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా కనెక్ట్ చేయగలుగుతుంది. ఎయిర్ టెల్ తో కలసి పనిచేసేందుకు చాలా ఉత్సుకతతో ఉన్నామని, స్టార్ లింక్ లో లభ్యమవుతున్న అనేక సేవలను అందించేందుకు ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నామని స్పేస్ ఎక్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్యాన్ షాట్వెల్ అన్నారు.ఎలన్ మస్క్ తన కంపెనీ ఇంపోర్టెడ్ ఎలక్ట్రిక్ కార్లను భారత్ లో షోరూమ్ లలో అమ్మేందుకు టెస్లాతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారు.
మస్క్ గుప్పిట ఇండియన్ మార్కెట్
స్టార్ లింక్, ఎయిర్ టెల్ ఒప్పందం ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ మార్కెట్ ను కొల్లగొట్ట నుంది.ఈ కంపెనీల మధ్య ఒప్పందం వల్ల మన దేశంలో గ్రామీణప్రాంతాల్లో సైతం హైస్పీడ్ బ్రాడ్ బాండ్ హై క్వాలిటీ ఇంటర్నెట్ సేవలు విస్తరిస్తాయి.
ఈ ఒప్పందం ప్రపంచంలోకే అతిపెద్ద మార్కెట్ కలిగిన మన టెలికాం రంగంపై అతిపెద్ద ప్రభావం చూపించనుంది.దాదాపు వంద కోట్ల మంది కస్టమర్లున్న రంగమిది. మన దేశంలో మొబైల్ టవర్ల నిర్మాణానికి,ఫైబర్ ఆప్టిక్ సేవలందించడానికి దేశ నైసర్గిక స్వరూపం ప్రధాన అడ్డంకి. కొండలు, మైదానాలు, పల్లపు ప్రాంతాలు ఎగుడు దిగుడు నేలల కారణంగా టెలికాం రంగ విస్తరణకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి ప్రాంతాలకు శాటిలైట్ ద్వారా స్టార్ లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించగలుగుతుంది.25-220 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఈ సేవలు అందుతాయి.ప్రస్తుతం మన దేశంలో ఉన్న 6,44,131 గ్రామాలలో 6,15,836 గ్రామాలకు 4జీ సేవలు అందుతున్నాయి.
స్టార్ లింక్ సేవల వ్యయం ఎలా?
మనదేశంలో ప్రస్తుతానికి ప్రపంచంలోనే అత్యంత చవకైన ఇంటర్నెట్ డాటా సేవల ధరలు ఉన్నాయి. స్టార్ లింక్ సేవలకు మనదేశంలో ఏడాదికి1,58,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని స్టార్ లింక్ ఇండియా డైరక్టర్ సంజయ్ భార్గవ అంటున్నారు. రెండవ ఏడాదికి అవి 1,15,000 కోట్లకే దక్కుతాయి.పొరుగున ఉన్న భూటాన్ కు మినహాయిస్తే మరే పొరుగు దేశానికి ఈసేవలు లేవు. భూటాన్ లో స్టార్ లింక్ రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ ప్రకారం నెలకు మూడు వేలు కడితే23 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్ సేవలు అందుతాయి. స్టాండర్ట్ రెసిడెన్షియల్ ప్లాన్ ప్రకారం నెలకు రూ. 4,200 కడితే 25-100 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ సేవలు అందుతాయి.ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాల్లో స్టార్ లింక్ సేవలున్నాయి. కెన్యాలో అయితే 10 డాలర్లకే నెలకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందుతుంది. అలేగా యూఎస్ లో నెలకు 120 డాలర్లు కడితే ఈ స్పీడ్ నెట్ అందుతుంది.
విస్తరిస్తున్నబ్రాడ్ బ్యాండ్ సేవలు
మనదేశంలో ఇంటర్నెట్ సేవలు గత పదేళ్లుగా గణనీయంగా పెరిగాయి.2014లో 25 కోట్ల మందికి బ్రాడ్ బాండ్ సేవలు విస్తరిస్తే 2024 కల్లా అది 96 కోట్లకు చేరుకుంది. వైర్ లెస్ డాటా సబ్ స్క్రైబర్ల సగటు నెలసరి డాటా వినియోగం 353 రెట్లు పెరిగింది.5జీ సేవలు అత్యంత వేగంగా విస్తరించిన ఏకైక దేశం కూడా మనదే.