జనవరి 13న ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల నుండి బుధవారం ఉదయం శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది. టీటీడీ చైర్మన్ బిఆర్నాయుడు, అదనపు ఈవో సిహెచ్వెంకయ్య చౌదరి రథానికి మేళతాళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న కుంభమేళాలో సెక్టార్ 6, భజరంగ్ దాస్ రోడ్డులోని నాగ వాసుకి దేవాలయం సమీపంలో యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. 170 మంది సిబ్బందితో నమూనా ఆలయంలో తిరుమల తరహాలో అన్ని రకాల కైంకర్యాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉత్తరాది భక్తులకు స్వామి వారి అర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి 18, 26 తేదీలు, ఫిబ్రవరి 3 , 12 తేదీల్లో 4 సార్లు కంభమేళాలో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మహా కుంభమేళాను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ప్రపంచం లోనే అతి పెద్ద ఉత్సవం కుంభమేళా కావడంతో అక్కడ కు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఈవో గౌతమి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్లు రామకృష్ణ, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.