శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య మహా సంస్ధానం దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం, శృంగేరి జగద్గురువులు శంకరాచార్య శ్రీశ్రీ విధుశేఖర భారతీ తీర్థ స్వామి వారు వచ్చే మే మాసంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలతో పాటు నేపాల్ దేశంలో ఆధ్యాత్మిక యాత్రలు చేయనున్నారు. ఈ మేరకు శృంగేరి శారదా పీఠం స్వామి వారి యాత్రా వివరాలు ప్రకటించింది. కర్నాటక రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, నేపాల్, మధ్య ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీలలో జగద్గురువులు శ్రీశ్రీ విధుశేఖర స్వామి వారి యాత్రలు కొనసాగనున్నాయి.
మే 13వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు మొత్తం 13 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. శృంగేరి నుంచి ప్రారంభమయ్యే యాత్ర ఆంధ్రప్రదేశ్ మీదుగా నేపాల్ వరకు సాగుతుంది. అక్కడి నుంచి మధ్య ప్రదేశ్లోని ఓంకారేశ్వర్ దగ్గర ముగుస్తుంది.
మే 13వ తేదీన శృంగేరి నుంచి ప్రారంభమై కర్ణాటకలోని తుముకూరుజిల్లా హొన్నుడికే ప్రాంతానికి చేరుకుంటుంది. ఆ మరోసటి రోజు మే 14వ తేదీన హొన్నుడికే నుంచి పావగడ చేరుకుంటుంది. ఈ సందర్భంగా భక్తులకు స్వామివారు దివ్య సందేశాన్ని ఇస్తారు. 15వ తేదీన తుముకూరు జిల్లా పావగడ నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్లోని కడప నగరానికి చేరుకుంటుంది. 16వ తేదీన కడప నుంచి ప్రారంభమయ్యే యాత్ర ప్రకాశం జిల్లా కొప్పారానికి చేరుకుంటుంది.
17వ తేదీన ప్రకాశం జిల్లా కొప్పారం నుంచి నెల్లూరు జిల్లా కావలి చేరుకుంటుంది. 18వ తేదీన నెల్లూరు జిల్లా కావలి నుంచి ప్రారంభమై ప్రకాశం జిల్లా సింగరాయకొండ వరకు సాగుతుంది. 18,19 తేదీల్లో సింగరాయకొండలోనే స్వామి వారు బస చేస్తారు.
మే 20వ తేదీన సింగరాయకొండ నుంచి విజయవాడ రానున్న విధుశేఖర స్వామి వారు నేరుగా నేపాల్ రాజధాని ఖాఠ్మాండు చేరుకుంటారు. 21 నుంచి 23 వరకు స్వామి వారు ఖాఠ్మాండులోనే బస చేస్తారు. మే 24వ తేదీన ఖాఠ్మాండు నుంచి ఇండోరు మీదుగా ఖండ్వా జిల్లా ఓంకారేశ్వర్ పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు. 24, 25 తేదీల్లో విధుశేఖర స్వామి వారు ఓంకారేశ్వర్లోనే ఉండి భక్తులకు అనుగ్రహ భాషణం చేస్తారు.