-
దశాబ్దాల నాటి పురాతన చెట్లకు పునర్జన్మ
-
కొత్త ప్రయోగం చేస్తోన్న నర్సరీల రైతులు
తూర్పు గోదావరి జిల్లా కడియంలో ఉన్న నర్సరీలు ప్రకృతికి ప్రతి సృష్టిగా నిలుస్తున్నాయి. ప్రకృతిలో మొక్క చెట్టవడం సహజం. కానీ కడియం నర్సరీ రైతులు చెట్లనే మొక్కలుగా మలుస్తున్నారు. దీన్ని సాధించడంలో వారు చూపుతున్న సాంకేతిక నైపుణ్యం, ప్రకృతి పట్ల నిబద్ధత అందరినీ ఆకట్టుకుంటోంది.
చెట్టు నుండి మొక్క – ప్రకృతికి ప్రతి సృష్టి
పర్యావరణ మార్పుల నేపథ్యంలో మొక్కలు నాటి వాటి ఎదుగుదల కోసం సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, నేరుగా పెద్ద చెట్లనే నాటాలన్న వినూత్న ఆలోచనను ఈ రైతులు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు గార్డెన్ అంటే ఏళ్ల తరబడి నిర్వహణ కాదు.. కొన్ని రోజుల వ్యవధిలోనే పెద్ద చెట్లు నాటే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది.
చైనా, థాయిలాండ్, స్పెయిన్ లాంటి దేశాల నుంచి పెద్దపెద్ద చెట్లను దిగుమతి చేసుకుని, ప్రత్యేక కంటైనర్లలో భారతదేశానికి తీసుకొచ్చి అమ్మకాలు చేపడుతున్నారు. అయితే కడియం రైతులు దీన్ని మరో దశకు తీసుకెళ్లారు. పాత చెట్లకు కొత్త జీవం ఇవ్వడమే వారి లక్ష్యం.
మాయం కాకుండా మళ్లీ దశాబ్దాల నాటి చెట్లకు పునర్జన్మ :
అడ్డంగా ఉన్న కారణంగా తొలగిస్తున్న పాత మర్రి, రావి చెట్లను అంగుళం అంగుళంగా కాపాడుతూ, వాటిని తిరిగి మొక్కలుగా పెంచుతున్నారు. పాత చెట్ల వేర్లను జాగ్రత్తగా తొలగించి, హైడ్రాలిక్ యంత్రాలతో వాటిని మళ్లీ నర్సరీకి తరలించి, పెద్ద కుండీల్లో పెంచడం ఎంతో క్లిష్టమైన పని. చెట్టుకు కొత్త ప్రాణం పోయడం ప్రకృతిలో ఓ అద్భుతమే.
లక్షల్లోనే మొక్కల ధరలు :
పాత చెట్లను నర్సరీలో పెంచిన తరువాత వాటి ధర లక్షల రూపాయలు పలుకుతోంది. వాటిని తక్కువ ధరకు దొరుకుతాయని భావించవద్దు. ఎందుకంటే వాటి నిర్వహణ ఖర్చు, పునర్జీవితం ఇవ్వడంలో పడే శ్రమ అంతా కలిపితే ఖరీదు పెరగడం సహజం. కొన్ని చెట్లు తిరిగి చిగురించకపోవడం వల్ల రైతులకు నష్టం కూడా కలుగుతుంది.
అయితే విజయవంతమైతే… ఆదాయంలో గణనీయమైన వృద్ధి సాధ్యమవుతుంది. ఉదాహరణకి, కడియం నర్సరీలో పెంచిన ఒక రావి చెట్టును హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి రూ. 12 లక్షలకు కొనుగోలు చేసిన ఘట్టం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
కడియం నర్సరీ రైతులు చేస్తున్న ఈ ప్రయోగం ఒక వైపు ప్రకృతి పరిరక్షణకు, మరోవైపు వాణిజ్య పునరావిష్కరణకు అద్దం పడుతోంది. చెట్లు కాపాడటమే కాక, వాటికి కొత్త జీవం ఇవ్వాలన్న ఆలోచన సరికత్తగా ఉంది కదూ…