రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణ చూడబోతున్నారని.. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కార్యక్రమాలు చేపడుతున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందులోభాగంగా త్వరలో రీజినల్ రింగ్ రోడ్డు పనులకు టెండర్లు ఖరారు చేస్తామన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్ లో జరిగిన బ్యాంకర్స్ సమావేశములో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బ్యాంకుల ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయానికి, సంక్షేమరంగాలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నామని గత ప్రభుత్వము వీటిని పట్టించుకోలేదన్నారు. ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందని.. అందుకు అనుగుణంగా మ్యాచింగ్ గ్రాంట్లు, సబ్సిడీ పథకాలు మంజూరు చేసి రాష్ట్ర ప్రజలకు సహకరించాలన్నారు.
వ్యవసాయ రుణాల పంపిణీలో వేగం పెంచాలని స్పష్టం చేశారు. రైతులకు సకాలంలో రుణాలు అందకపోతే వృధా అని… రబి పంట రుణాల పంపిణీ లో వేగం పెంచాలని డిప్యూటీ సిఎం భట్టి ఆదేశించారు.