దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షంతో పాటే ఢిల్లీని పొగమంచు కప్పేసింది. దీంతో, రోడ్లమీద వంద మీటర్ల దూరంలో ఉన్నవి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులో శుక్రవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనావేసింది. అంతేకాదు.. శనివారం ఢిల్లీలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.
రాజధాని నగరంలో తాజా వాతావరణాన్ని పర్యాటకులే కాకుండా స్థానికులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. పొగమంచుతో కూడిన నగరం కశ్మీర్లా కనిపిస్తోందని, ఎంతో ఆహ్లాదకరంగా ఉందంటున్నారు. తాజా వాతావరణంతో రిఫ్రెష్ అవుతున్నామని టూరిస్టులు అంటున్నారు.ఇక, వర్షం కారణంగా కాలుష్యం తీవ్రత తగ్గిందని స్థానికులు చెబుతున్నారు.
మరోవైపు.. వాతావరణంలో కాస్త మెరుగుదల కనిపించినప్పటికీ, కాలుష్యంతీవ్రత తగ్గినప్పటికీ పూర్తిగా తగ్గలేదు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పేలవంగానే ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రిపోర్ట్ ప్రకారం, ఉదయం 7 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 371గా నమోదైంది.
ఇక ఢిల్లీలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే.. ఆనంద్ విహార్ వద్ద 398, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (T3) వద్ద 340, అయా నగర్ వద్ద 360, లోధి రోడ్ వద్ద 345, ITO వద్ద 380, చాందినీ చౌక్ వద్ద 315, పంజాబీ బాగ్ దగ్గర 386గా నమోదయ్యింది.