-
ఉగ్రదాడిలో మరణించిన వాళ్ల ఆత్మశాంతికి కార్యక్రమం
-
వినూత్నంగా ప్రవాస భారతీయుల నివాళులు
ఈనెల 22వ తేదీన పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ.. ప్రవాస భారతీయులు అమెరికాలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ముష్కర మూకల కాల్పుల్లో మరణించిన వాళ్ల ఆత్మ శాంతిని ఆకాంక్షిస్తూ.. మౌనదీపం కార్యక్రమాన్ని చేపట్టారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
ప్రవాస భారతీయులు, తెలుగువాళ్లు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మృతులకు శ్రద్ధాంజలి అర్పించడంతో పాటు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మానవత్వం, శాంతి, ఐక్యత వంటి విలువలను గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
ఈ మౌనదీపం కార్యక్రమం ద్వారా ఉగ్రవాదాన్ని ఖండించే సంకేతాలు ఇస్తూ.. బాధితుల కుటుంబాలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లందరూ సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.