ఛత్తీస్గఢ్- తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో ఆరో రోజూ కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం బ్లాక్ హిల్స్ అడవుల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ గుట్టలను అన్నివైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. భద్రతా బలగాలు భారీ సొరంగాన్ని గుర్తించాయి. దాదాపు వెయ్యి మంది వరకు తలదాచుకునేందుకు వీలుగా దీని నిర్మాణం ఉందిగుట్టలో పెద్ద మైదానంతో విశాలంగా ఉన్న సొరంగాన్ని జవాన్లు గుర్తించారు. ఇందులో నీటి వసతి, ఇతర సౌకర్యాలున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల పాటు మావోయిస్టులు ఈ సొరంగంలోనే ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.
ఈ గుట్టల్లో పెద్ద సంఖ్యలో ఉన్న మావోయిస్టులు కూడా డీహైడ్రేషన్కు గురయ్యారని, వారి పరిస్థితి విషమంగా మారుతోందని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఆపరేషన్ కారణంగా.. మావోయిస్టులు ఆహారం కోసం ఇబ్బందులు పడుతూ ఉండొచ్చని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. మావోయిస్టులు ప్రస్తుతం దాక్కున్న అన్ని కొండలను చుట్టుముట్టే వరకు.. ఈ ఆపరేషన్ కొనసాగించాలని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకొని ఛత్తీస్గఢ్లోని కొత్తపల్లి మొదలుకొని భీమారంపాడు, కస్తూరిపాడు, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజారికాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్గంలో ప్రధానంగా ఆపరేషన్ కొనసాగుతోంది.
మరోవైపు కర్రిగుట్టల నుంచి మోస్ట్ వాంటెడ్ హిడ్మా సహా.. మావోయిస్టు దళాలు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. భద్రతా బలగాల రాకను పసిగట్టి మకాం మార్చినట్లు సమాచారం. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు తప్ప మరెవరూ చనిపోలేదని.. పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ఎండలు మండుతున్న వేళ ఆపరేషన్ చేపట్టిన బలగాలు కూడా నీరసించిపోతున్నాయి. రోజుల తరబడి నడకతో 100 మందికి పైగా జవాన్లు వడదెబ్బ, డీహైడ్రేషన్కు గురయ్యారని తెలుస్తోంది.
ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దు కేంద్రంగా చేసుకొని.. ఛత్తీస్గఢ్లోని కొత్తపల్లి మొదలుకొని భీమారంపాడు, కస్తూరిపాడు, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజారికాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్గంలో ప్రధానంగా ఆపరేషన్ కొనసాగుతోంది. రుద్రారం వరకు 90 కిలోమీటర్ల పొడవున కర్రెగుట్టలను అధీనంలోకి తెచ్చుకునేందుకు.. బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దట్టమైన అడవులను జల్లెడ పడుతూ కొండలపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భద్రతా బలగాలు అతి కష్టం మీద శనివారం సాయంత్రం కొంతమేరకు గుట్టలపైకి ఎక్కగలిగాయి.
కూంబింగ్ జరుగుతుండగా.. శనివారం భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందినట్లుగా ప్రచారం జరిగింది. కానీ.. ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్ పోలీస్ ఉన్నతాధికారులు నిర్ధారించలేదు. కర్రెగుట్టల అభయారణ్యంలో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ల ఏర్పాటు వేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. నక్సల్స్కు కంచుకోటగా ఉన్న అబూజ్మడ్ను వీటితోనే ఛిన్నాభిన్నం చేశారు. అదే తరహాలో ఇక్కడా ఎఫ్ఓబీలు నెలకొల్పి మావోయిస్టులను నిలువరించాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. బ్లాక్ హిల్స్ సమీపంలో ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీమారంపాడు, పూజారికాంకేర్, నంబి, గల్గం, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగుప్పలో బేస్ క్యాంపులు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం కర్రెగుట్టలకు అనుబంధంగా ఉన్న పామునూరు, తడపల, పెనుగోలు ప్రాంతాల్లో వాటి ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్యాంపుల్లో దాని పరిధికి అనుగుణంగా 500 నుంచి 1000 మంది జవాన్లతో భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్లో రక్షణ దళానికి చెందిన అత్యాధునిక హెలికాప్టర్లు కీలక భూమిక పోషిస్తున్నాయి. నిత్యం గుట్టలపై చక్కర్లు కొడుతున్నాయి. మావోయిస్టులు బంకర్లలో దాక్కున్నారన్న అనుమానంతో వారిని బయటకు రప్పించేందుకు పెద్దఎత్తున బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లను వినియోగిస్తున్నట్లు సమచారం. డజన్ల సంఖ్యలో అధునాతన డ్రోన్లతో బ్లాక్ హిల్స్ను నిశితంగా పరిశీస్తున్నారు. ఈ ఆపరేషన్ మరో వారంపాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. బలగాలకు సరిపడా సామాగ్రిని సిద్ధం చేసి పంపారు. ఈ ఆపరేషన్తో సమీప గిరిజన గ్రామాలు వణికిపోతున్నాయి.