-
లోకాయుక్త జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి, ఉప లోకాయుక్త బి.ఎస్.జగ్జీవన్ కుమార్
-
ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
తెలంగాణ కొత్త లోకాయుక్త, ఉప లోకాయుక్త ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో ఇద్దరి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. లోకాయుక్తగా జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి , ఉప లోకాయుక్తగా బి.ఎస్.జగ్జీవన్ కుమార్ సోమవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహా దారులు కె.కేశవరావు, షబ్బీర్ అలీ, వేం నరేందర్రెడ్డి సహా పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి , బి.ఎస్.జగ్జీవన్ కుమార్లు తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తిస్తూ, రాష్ట్రంలో అవినీతిని నిరోధించడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా హాజరైన వారు ఆశాభావం వ్యక్తం చేశారు. వీరి నియామకం రాష్ట్ర పాలనలో మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా పరిగణించబడుతోంది. లోకాయుక్త , ఉపలోకాయుక్తల నియామకంతో ప్రజలు తమ సమస్యలను , అవినీతికి సంబంధించిన ఫిర్యాదులను నిష్పక్షపాతంగా విచారించే ఒక ఉన్నత స్థాయి వేదికను ఆశించవచ్చు.