- 50 మందికి పైగా తీవ్ర గాయాలు…
- లడ్డూ మహోత్సవ్ సందర్భంగా ప్రమాదం
- భక్తుల తాకిడికి ఒరిగిపోయిన వెదరు ప్లాట్ ఫామ్
- ఘటనపై యూపీ సీఎం విచారం…
ఉత్తర ప్రదేశ్ లోని భాగ్ పట్ లో ఓ వెదురు ప్లాట్ ఫామ్ బ్రిడ్జి కూలిపోయి ఏడుగురు చనిపోగా, 50మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.బారౌత్ లోని జైన్ కమ్యూనిటీ వారు ఇటీవల ఓ ఉత్సవాన్ని నిర్వహించారు. లడ్డూ మహోత్సవ్ పేరిట జరిపిన ఈ ఉత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. దేవుడికి నివేదించడానికి పెద్ద ఎత్తున లడ్డూలు కూడా తీసుకొచ్చారు. భక్తులు ప్రార్ధించుకోడానికి వీలుగా ఆలయం దగ్గర ఓ వెదురు బ్రిడ్జి లాంటి ప్లాట్ ఫామ్ ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.అయితే అందరూ ఒకేసారి ఆ ప్లాట్ ఫామ్ మీదకు చేరడంతో బరువు తట్టుకోలేక ఆ ప్లాట్ ఫామ్ కూలిపోయి భక్తులందరూ ఒకరిపై ఒకరు పడిపోయారు.ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. అయితే తొక్కిసలాటలో గాయపడిన వారికి ఫస్ట్ ఎయిడ్ అందించి పంపేశారు. తీవ్రగాయాలైన వారిని అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. భాగ్ పట్ పోలీసులు సకాలంలో అక్కడకు చేరుకుని పరిస్థితిని వెంటనే చక్కదిద్దారు. గత 30 ఏళ్లుగా ఈ ఉత్సవం నిర్వహిస్తున్నామని, ఎన్నడూ ఇలాంటి దుర్ఘటన జరగలేదని నిర్వాహకులు వాపోతున్నారు. మరోవైపు ఘటన గురించి ఆరా తీసిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణం సహాయ అందించాలని ఆదేశించారు. గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.