- ట్రంప్ మార్క్ ట్రేడ్ ప్రతిపాదనలు
- వచ్చే నెలలో మోడీ అమెరికా టూర్
- ఇమ్మిగ్రంట్ల విషయంలో మోడీ సరైన నిర్ణయం తీసుకుంటారన్న ట్రంప్
వచ్చీరాగానే సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలపై తన దైన ముద్ర వేస్తున్న అగ్రరాజ్యం అధిపతి డోనాల్డ్ ట్రంప్ తమ దేశం నుంచి భారత్ అత్యున్నత సాంకేతిక పరిజ్నానంతో కూడిన రక్షణ పరికరాలను కొనుగోలు చేయాలని సూచించారు. ఇండో పసిఫిక్ తీర ప్రాంతంలో భారత్ ఒక కీలక భాగస్వామి దేశంగా ఎదుగుతోందని, అమెరికా నుంచి మరిన్ని రక్షణ పరికరాలు కొనుగోలు చేసి అరమరికలు లేని ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని నెలకొల్పుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోడీతో నిన్న ఫోన్ లో మాట్లాడిన ట్రంప్ వచ్చే నెలలో మోడీ అమెరికా రానున్నారని తెలిపారు. మోడీతో ప్రయోజనకరమైన సంభాషణ జరిపినట్లు, ఇండో పసిఫిక్, మధ్య ప్రాచ్య దేశాలు, యూరోప్ లో సంక్షోభం తో పాటు అనేక అంశాలపై తాము సుదీర్ఘ సంభాషణ జరిపినట్లు వెల్లడించారు. భారత, అమెరికా దేశాల మధ్య వ్యూహత్మక భాగస్వామ్యం పైనా, ఇండో -పసిఫిక్ క్వాడ్ భాగస్వామ్యంపైనా చర్చలు జరిపినట్లు వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాదిలో భారత్ తొలి క్వాడ్ సదస్సును నిర్వహిస్తున్నందున దానిపైనా ఇరువురు నేతలూ సంభాషించినట్లు వెల్లడించింది. రెండు వివాదాలకు యూరప్, మధ్యప్రాచ్య దేశాలు కారణమయ్యాయని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఒకటి కాగా, ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలు మరొకటి. ఈ నేపధ్యంలో చైనా జోక్యం ఎక్కువగా ఉన్న పసిఫిక్ తీరప్రాంతం పై అమెరికా, భారత దేశాల మధ్య సంబంధాలు బలపడాల్సిన అవసరాన్ని ట్రంప్ నొక్కి చెప్పారు.
భారత్ సరైన పనే చేస్తుంది… ట్రంప్
అమెరికన్ ఫస్ట్ పాలసీ అమలుకోసం ఇమ్మిగ్రేషన్ పై కొరడా ఝుళిపిస్తున్న ట్రంప్ అమెరికాలో ఎంట్రీ కోసం దొడ్డి దారిలో వచ్చిన వేలాది మంది ఇమ్మిగ్రంట్లను వెనక్కు పంపేస్తున్న నేపధ్యంలో, భారతీయుల విషయంలో మోడీ సరైన నిర్ణయమే తీసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెలలో అమెరికా పర్యటిస్తున్న మోడీ వివాదాస్పదమైన ఈ ఇమ్మిగ్రేషన్ పాలసీపై ట్రంప్ తో చర్చలు జరుపుతారా? లేక లక్షలాది భారతీయుల కోసం ప్రత్యామ్నాయం ఏదైనా సూచిస్తారా అన్నది తేలాల్సి ఉంది.
2019లో మోడీ అమెరికాలో పర్యటించారు. టెక్సాస్ లో జరిగిన హౌడీ మోడీ ఈవెంట్ అప్పట్లో గ్రాండ్ సక్సెస్ అయింది. అలాగే ట్రంప్ భారత్ వచ్చినప్పడు నమస్తే ట్రంప్ పేరుతో అహ్మదాబాద్ లో మన దేశం కూడా ఓ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది.