ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత ప్రధానకార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈనెల 31 తేదీన పదవీవిరమణ చేస్తారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ బాధ్యతలు చేపడుతారు. విజయానంద్ పదకొండు నెలల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.
1992 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్. సీనియర్ ఐఏఎస్ విజయానంద్ ప్రస్తుతం ఇంధనశాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె ఆయన స్వస్థలం. ఆదిలాబాద్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా తొలి పోస్టింగ్ నిర్వహించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా, శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల కలెక్టర్గా పనిచేశారు. ఏపీ ట్రాన్స్కో, జెన్కో ఎండీగా సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)గానూ పనిచేశారు. 2025 నవంబరులో విజయానంద్ పదవీ విరమణ చేయనున్నారు.