ఉత్తరప్రదేశ్ లోని త్రివేణి సంగమం ప్రయాగ్ రాజ్ లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ 45 రోజుల పాటు మహా కుంభ మేళా జరుగనున్నది. కుంభమేళాకు 40 కోట్లమంది భక్తులు హాజరవుతారని అంచనా. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాయి.
భక్తుల భద్రత కోసం పారా మిలిటరీ బలగాలతోపాటు 50 వేల మంది సిబ్బందిని నియమించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో కూడిన 2700 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. తొలిసారి అండర్ వాటర్ డ్రోన్లను వినియోగిస్తున్నారు. కుంభమేళా సమాచారం తెలుసుకోవడానికి 11 భారతీయ భాషల్లో ఏఐ చాట్ బోట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు తాత్కాలిక వసతి కల్పనకు వేల సంఖ్యలో టెంట్లు, షెల్టర్లతో మహా కుంభ్ నగర్ నిర్మిస్తున్నారు. దీన్ని గూగుల్ మ్యాప్ తోనూ అనుసంధానిస్తారు. కుంభమేళాకు వచ్చిన భక్తులకు చికిత్స చేసేందుకు తాత్కాలిక దవాఖానలు కూడా ఏర్పాటు చేశారు. ఒకేసారి 200 మందికి చికిత్స అందించేందుకు వీలుగా బీష్మ క్యూబ్ ఏర్పాటు చేస్తున్నారు.
ఇక నేత్ర కుంభ్ శిబిరం ద్వారా ఐదు లక్షల మంది భక్తులకు కంటి పరీక్షలు నిర్వహించి మూడు లక్షలకు పైగా కండ్లద్దాలు పంపిణీకి చర్యలు చేపట్టారు. భక్తులు కుంభ మేళాలో ఆయా ప్రదేశాలకు వెళ్లేందుకు ఆంగ్లం, హిందీ, ప్రాంతీయ భాషల్లో 800 బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక 92 రోడ్లు పునర్నిర్మిస్తున్నారు. 17 ప్రధాన రహదారుల సుందరీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా అత్యాధునిక బహుళ విపత్తు నివారణ వాహనాలను మోహరిస్తున్నారు. సౌర విద్యుత్ తో లైటింగ్ వసతులు కల్పిస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించారు.