జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా కాళేశ్వరంలో మే 15 వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతి పుష్కరాల సందర్బంగా త్రివేణి సంగమం వద్ద సరస్వతి ఘాట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ పుష్కర ఘాట్ ప్రారంభం అనంతరం, కాళేశ్వర త్రివేణీ సంగమంలో ముఖ్యమంత్రి పుణ్యస్నానం ఆచరిస్తారు. ముఖ్యమంత్రి తోపాటు పలువురు మంత్రులు కూడా ఈ పుష్కరాలలో పాల్గొంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అరుదైన సరస్వతి మహా పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 5.44 గంటలకు తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పాటు పుష్కర స్నానం ఆరంభిస్తారు. ప్రతీ రోజూ ఉదయం 8 .30 గంటలనుండి 11 గంటల వరకు యాగాలు నిర్వహిస్తారు. ప్రతీ రోజూ సరస్వతి ఘాట్ లో 6 .45 నుండి 7 .35 గంటల వరకు సరస్వతి ఘాట్ లో ప్రత్యేక సరస్వతి నవరత్న మాలహారతి నిర్వహిస్తారు. పుష్కర్ స్నానం ఆచరించేవారికి తాత్కాలిక టెంట్ సిటీ లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు రోజూ రాత్రి కళా, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
12 యేళ్ల తర్వాత బృహస్పతి మిధునరాశిలో…
సరస్వతి నదిని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే “అంతర్వాహిని” (అదృశ్య నది) గా పరిగణిస్తారు. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశి ( మిథునరాశి )లోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు ఆచరిస్తారు. బృహస్పతి దేవ గురువు . బృహస్పతి జ్ఞానం, విద్య , ఆధ్యాత్మికతకు అధిపతిగా పరిగణించబడుతున్నాడు. బృహస్పతిని గురుగ్రహం అని కూడా అంటారు. గురువు ఏడాదికి ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. ఒక రాశి నుంచి వెళ్లిన తర్వాత అదే రాశిలోకి అడుగు పెట్టడానికి 12 యేళ్లు పడతాయి. ఏ రాశి లో సంచరిస్తాడో ఆ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సరం మే 14 న రాత్రి 10.35 గం మిథునరాశిలోకి బృహస్పతి అడుగు పెట్టనున్నాడు.
సరస్వతి నది అంతర్వాహినిగా కాళేశ్వరం దగ్గర ప్రవహిస్తుంది …
2025 మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరకాలం ప్రారంభమవుతుందని.. మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్యస్నానాలు ఆచరించాల్సి ఉంటుందని కాళేశ్వరం పుణ్యక్షేత్ర ఆలయ అర్చకులు వివరించారు. మే 15 నుంచి 26 వరకు పుష్కర కాలం ఉంటుందని వివరించారు.
సరస్వతీ నది పుష్కరాలకు రావాలని కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కి సీయం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులు ఫోన్ చేసి ఆహ్వానించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దాదాపు మూడు నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పుష్కర స్నానమాచరించడానికి రానుండటంతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.