భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి కలిశారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతితో త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడికి భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట చేపట్టిన ప్రతిస్పందన విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఆపరేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను, ఆపరేషన్ ప్రణాళికను, అమలును రాష్ట్రపతికి వారు వివరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత త్రివిధ దళాలు చూపిన ధైర్యం, కార్యాచరణలో చూపించిన ధృఢ సంకల్పాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు.
ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం రాష్ట్రపతి భవన్ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. భారత రక్షణ దళాల దూకుడు, అంకితభావం, విజయవంతమైన చర్యలపై రాష్ట్రపతి కొనియాడినట్టు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ఉగ్రవాదంపై తీసుకున్న కఠిన నిర్ణయాలు, సాయుధ దళాల సాహసం వల్లే విజయం సాధించాయని రాష్ట్రపతి భవన్ స్పష్టం చేసింది.