‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత భారత్పై తప్పుడు సమాచారం ప్రచారం చేసిన టర్కీ, చైనా ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థలపై భారత్ కఠినంగా స్పందించింది. టర్కీ ప్రభుత్వానికి చెందిన ప్రసార సంస్థ ‘టీఆర్టీ వరల్డ్’ ఎక్స్ అకౌంట్ను కేంద్ర ప్రభుత్వం బుధవారం బ్లాక్ చేసింది. ఇదే సమయంలో చైనా ప్రభుత్వ మీడియా సంస్థలు ‘గ్లోబల్ టైమ్స్’, ‘జిన్హువా’ ఎక్స్ అకౌంట్లను కూడా బ్లాక్ చేసింది.
ఈ చర్యలు తీసుకున్న క్రమంలో, పాకిస్థాన్ భారత్ గగనతలంలోకి చొరబడేందుకు ఉపయోగించిన డ్రోన్లు టర్కీలో తయారైనవని ఫోరెన్సిక్ నివేదికలు స్పష్టంగా గుర్తించిన నేపథ్యంలో కేంద్రం మరింత అప్రమత్తమైంది. భారత భూభాగంపై జరిగిన డ్రోన్ దాడులను సకాలంలో తిప్పికొట్టి, ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్న భారత రక్షణ దళాలు, అంతర్జాతీయ స్థాయిలో తప్పుడు ప్రచారాలను కూడా ఆపే దిశగా చర్యలు చేపట్టాయి.
ఈ అకౌంట్లపై యాక్సెస్ ప్రయత్నం చేసిన వారికి ప్రస్తుతం “ఖాతా నిలిపివేయబడింది. చట్టపరమైన డిమాండ్కు ప్రతిస్పందనగా భారతదేశంలో నిలిపివేయబడింది” అనే సందేశం కనబడుతోంది. ఇవి ప్రత్యేకంగా ‘ఆపరేషన్ సిందూర్’ను లక్ష్యంగా చేసుకుని నకిలీ వార్తలు, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రచారం చేసినట్లు అధికారులు గుర్తించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రశిబిరాలపై భారత వైమానిక దళాలు నిర్వహించిన కచ్చితమైన దాడుల అనంతరం ఈ అసత్య ప్రచారం జరిగిన విషయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.