ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ పేరు చెపితే ఎక్కడా అప్పు పుట్టడం లేదని నిన్న సీయం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇస్తామని చెప్పిందే ఉద్యోగులు అడుగుతున్నారని కేటీఆర్ అన్నారు. ఉద్యోగుల త్యాగాల గురించి రేవంత్ రెడ్డికి తెలియదని, ఎన్జీఓల త్యాగాలతో తెలంగాణ వచ్చిందని తెలిపారు. కేసీఆర్ ఉద్యోగులకు 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వ లోపం తెలంగాణకు శాపమని అన్నారు. తండ్రిలాంటి ముఖ్యమంత్రే సొంత రాష్ట్రానికి శాపాలు పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వేల మంది త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను అవమానించే విధంగా రేవంత్ మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన చేతకాదని.. రేవంత్ రెడ్డి కాడి పడేశాడని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ ని సీయం చేసి రాహుల్ గాంధీ చాలా తప్పు చేశారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డివి దివాళాకోరు మాటలని, ఏ రాజకీయ నాయకుడు ఇలా మాట్లాడలేదన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ హయాంలో అప్పులు చేసిన మాట వాస్తవమని, ఇప్పుడు అందాల పోటీలపై సీయం రేవంత్ రెడ్డి కూర్చుని సమీక్షలు చేస్తు్న్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కేసీఆర్ కట్టిందే అని చెప్పారు. ఒక వైపు దివాళాకోరు మాట్లాడుతూ మరోవైపు తెలంగాణ రైజింగ్ అనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. నల్గొండ మంత్రులు హెలికాఫ్టర్లను షేర్ ఆటోల కంటే అధ్వన్నంగా వాడుతున్నారన్నారు. పరిపాలన చేతకాకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.