బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. తనదైన శైలిలో కేసీఆర్కు సవాల్ విసిరారరు.ఫాంహౌస్లో కూర్చొని గంభీరంగా చూస్తున్నానంటున్నావ్.. ఎవరిని చూస్తున్నావ్… అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. అచ్చోసిన ఆంబోతుల్లాగా కొడుకును, అల్లుడిని ఊరి మీదకు వదిలావని, వాళ్లేమో మేకపోతుల్లా మేస్తున్నారని, ప్రజలు గాడిద గుడ్డు ఇచ్చినా కేసీఆర్ కు బుద్ధి మారలేదని రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. అంతేకాదు.. ఫాంహౌస్ లో పడుకుని మెదడు కోల్పోయావా? అని రేవంత్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలను అడ్డు పెట్టుకుని రైతుబంధు ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్ది అని విమర్శించారు. ఆయన ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులను తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల ఖాతాలో వేశామన్నారు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ చేసిన రైతు రుణమాఫీ కేవలం రూ.18వేల కోట్లు మాత్రమే అన్నారు. ఇందులో మిత్తికి పోగా నికరంగా ఆయన చేసిన రుణమాఫీ కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే అని ఎద్దేవా చేశారు. కానీ , తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.21వేల కోట్లు రుణమాఫీ చేశామన్నారు. తాము రుణమాఫీ చేయలేదంటున్న కెసిఆర్.. ఫాం హౌస్ కు వచ్చినోళ్లకు జోలి చెప్పుడు కాదని.. అసెంబ్లీకి వస్తే.. అసలు లెక్కలన్నీ చెబుతామని సవాల్ విసిరారు. రైతుల జాబితాతో సహా తాము చేసిన రుణమాఫీ లెక్కలు చూపిస్తామన్నారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలని మరీ మరీ సవాల్ విసిరారు. కేసీఆర్ మాదిరిగా ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి పంగనామాలు పెట్టిన చరిత్ర తనది కాదన్నారు రేవంత్. జహంగీర్ పీర్ దర్గాకు, వేములవాడ రాజన్నకు నిధులు ఇస్తానని మోసం చేసినవ్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాఉద.. పాలమూరును ఎరవేసి ఎండబెట్టిన దుర్మార్గుడు కెసిఆర్ అన్నారు. తమ ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ జరిగిందని, రూతు భరోసానూ ఇస్తున్నామన్నారు. మార్చి 31వ తేదీ లోగా రూ.10 వేల కోట్లు రైతు భరోసా వేస్తామన్నారు. భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామన్నారు. మొదటి ఏడాదిలోనే 55,142 ఉద్యోగ నియామకాలు పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. నీ నాయకత్వంపై నీకు నమ్మకం ఉంటే అసెంబ్లీకి రా అని కేసీఆర్కు సవాల్ విసిరారు. కొడితే బలంగా కొట్టడం సంగతి పక్కకు పెడితే సరిగ్గా నిలబడటం నేర్చుకోమని హితవు పలికారు. ట్విట్టర్ లో ఈయనకు లైకులు ఎక్కువ వచ్చాయని చెప్పుకుంటుండని, పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన సోషల్ మీడియాలో లైకులు వచ్చాయని చెప్పుకుంటుండు అంటే ఆయన మానసిక స్థితి ఎట్లుందో అర్థం చేసుకోండని రేవంత్ ఎద్దేవా చేశారు. కెసిఆర్ ముందు నీ కొడుకును, అల్లుడిని దారిలో పెట్టుకో అని సూచించారు. బీసీ కులగణన, మాదిగ వర్గీకరణపై ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ పెడుతున్నామన్నారు. పొంకనాలు కొట్టుడు కాదు.. దమ్ముంటే అసెంబ్లీకి రా మాట్లాడుకుందాం అని రేవంత్రెడ్డి కేసీఆర్కు సవాల్ చేశారు. అసలు ఫాం హౌస్ లో ఉన్న కెసిఆర్ కు ప్రజలతో బంధం తెగిపోయిందన్నారు. కెసీఆర్ కాలం చెల్లిన వెయ్యి నోటు అని అభివర్ణించారు. కెసీఆర్ మమ్మల్ని అభినందించడానికి నీకు మనసు రాకపోతే ఫామ్ హౌస్ లోనే పడుకోమని రేవంత్రెడ్డి సలహా ఇచ్చారు.