ఆంధ్రప్రదేశ్ లో ఇక నుంచి సెలవు రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై సెలవు రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
వివిధ కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ ఇప్పుడు అంతగా లేదు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు చప్పగా సాగుతున్నాయి. అయినా ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడం ప్రజలను విస్మయ పరుస్తోంది. తెలంగాణలో ధరణి తరహాలో అవకతవకలు జరిగే ప్రమాదం పొంచి ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ పేరుతో ఉద్యోగులకు సెలవులు లేకుండా చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.