2024 ఆర్థిక సంవత్సరంలో, దక్షిణ మధ్య రైల్వే స్క్రాప్ అమ్మకాల ద్వారా ముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఏడాది దక్షిణ మధ్య రైల్వే, రూ.430 కోట్ల లక్ష్యాన్ని అధిగమించి, మొత్తం రూ. 501.72 కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో స్క్రాప్ అమ్మకాల ద్వారా రూ.411.39 కోట్లు సంపాదించగా, ఈ ఏడాది గణనీయమైన వృద్ధి సాధించింది.
స్క్రాప్ అమ్మకాలను పూర్తిగా ఆన్లైన్ విధానంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఈ విధానం ద్వారా స్క్రాప్ అమ్మకాల్లో అవినీతిని నివారించి.. మెరుగైన నిర్వహణను అందించామని వివరించారు.
స్క్రాప్ నిర్వహణలో భాగంగా, దక్షిణ మధ్య రైల్వే మెటీరియల్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ “జీరో స్క్రాప్ ప్రాజెక్ట్” లక్ష్యాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా, తుక్కును తక్షణమే గుర్తించి, ఒక ట్రక్ లోడ్ పరిమాణంలో పేరుకుపోకుండా సమయానికి విక్రయించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రాజెక్టు వల్ల ఖజానాకు ఆర్థిక వనరులు కూడా లభిస్తున్నాయి.
అలాగే, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “స్వచ్ఛ భారత్ అభియాన్” ప్రాజెక్టుకు ఈ స్క్రాప్ విధానం ఎంతో తోడ్పడుతోంది. వ్యర్థాలను సమర్థంగా నిర్వహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో కూడా దక్షిణ మధ్య రైల్వే కీలక పాత్ర పోషిస్తోంది.
మెటీరియల్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ బృందం చూపిన అంకితభావం, కృషి వల్లే ఈ రికార్డు స్థాయి ఆదాయాన్ని సాధించగలిగిందని, ఈ బృందాన్ని జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రశంసించారు.