పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ ప్రోబా – 3 ఉపగ్రహాలను మోసుకెళ్లింది. కృత్రిమ సూర్య గ్రహణాన్ని సృష్టించడం ద్వారా భానుడి గుట్టు విప్పేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ప్రోబా-3 మిషన్ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపింది. ఈ ప్రయోగం బుధవారమే చేపట్టాల్సి ఉన్నా… చివరి నిమిషంలో ప్రోబా3 స్పేస్క్రాఫ్ట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగం ఈరోజుకు వాయిదా పడింది.
అంతరిక్ష పరిశోధనలో దూసుకుపోతూ.. ప్రపంచ దేశాలకు సాధ్యం కాని రికార్డులను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) తిరగరాస్తోంది. చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ భాగంపై సురక్షితంగా ల్యాండింగ్ చేసి మన సత్తా ఏంటో ఇస్రో ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ క్రమంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA) సైతం తమ శాటిలైట్లను ప్రయోగించాలని ఇస్రోను ఆశ్రయించింది. దీంతో ఇస్రో.. PSLV- C59 PROBA 3 మిషన్ చేపట్టింది. ఇందుకోసం ప్రోబా 3 అనే రెండు శాటిలైట్లను అభివృద్ధి చేసింది.
సూర్యుడి బయటి పొర అయిన కరోనాను స్టడీ చేసే లక్ష్యంతో పీఎస్ఎల్వీ- సీ59/ ప్రోబా 3 మిషన్ చేపట్టారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసిన ఈ మిషన్లో కరోనాగ్రాఫ్, అకల్టర్ అనే రెండు శాటిలైట్లను అమర్చింది. సుమారు 550 కిలోల బరువు ఉండే ఈ రెండు శాటిలైట్లో భూకక్ష్యలో తిరుగుతూ కరోనాను అధ్యయనం చేస్తాయి. భూమిపై పవర్ గ్రిడ్లను, కమ్యూనికేషన్ సిస్టంలకు అంతరాయం కలిగించే సౌర తుఫానులు, కరోనల్ మాస్ ఎజెక్షన్ల గురించి కూడా ఇవి శోధిస్తాయి. సూర్యుడి ఉపరితలం కన్నా కరోనా ఎందుకంత వేడిగా ఉంటుందనే తేల్చేందుకు ఈ ప్రయోగం బాటలు వేయనుంది. దీంతోపాటు సూర్యుడి వాతావరణం గురించి మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంది.
ప్రోబా- 3 మిషన్లో రెండు అడ్వాన్స్డ్ స్పేస్ క్ట్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇవి ఒకదానిపై ఒకటి అమరి ఉన్నాయి. రాకెట్ వీటిని నిర్ణీత దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అనంతరం ఇవి ఒకే యూనిట్గా ఉంటూ 150 మీటర్ల దూరం పాటిస్తూ తిరుగుతాయి. అకల్టర్ అనే శాటిలైట్లో 1.4 మీటర్ల అకల్టింగ్ డిస్క్ అమర్చారు. ఇది సూర్యుడి బ్రైట్నెస్ను అడ్డుకోగలదు. ఫలితంగా, కృత్రిమ సూర్యగ్రహణం క్రియేట్ అవుతుంది.
అప్పుడు ఈ అకల్టర్ నీడలోకి కరనోగ్రాఫ్ శాటిలైట్ వచ్చి స్టడీ చేస్తుంది. అయితే, సహజమైన గ్రహణాల్లా కొన్ని నిమిషాల పాటే ఉండకుండా దాదాపు 6 గంటల దాకా కృత్రిమ సూర్యగ్రహణం ఉంటుంది. ఫలితంగా,సూర్యుడి కరోనాను అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ అరుదైన ప్రయోగం సక్సెస్ కావడంతో భారత్ ఖ్యాతి మరింత పెరగింది.