తెలంగాణలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం స్తంభంపల్లి, జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్దధన్వాడ సమీపంలో ఇథనాల్ పరిశ్రమల విషయంలో స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు.
ధర్మపురి నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. చివరకు మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఓటిమికి కారణాల్లో ఇది కూడా భాగమని విశ్లేషణలు ఉన్నాయి. గద్వాల జిల్లాలో గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, ప్రజా అభిప్రాయాలు సేకరించకుండా.. కంపెనీ ఏర్పాటు కు సన్నాహాలు చేయటం వివాదానికి దారి తీసింది. పైగా రోడ్డు, విద్యుత్ పనులు చేస్తుండడంతో 12 గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు.
తాజాగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును రద్దు చేయాలని కోరుతూ రైతులు మహాధర్నా చేపట్టారు. మహాధర్నాలో పాల్గొన్న కొందరు రైతు ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరుతూ ఈరోజు రైతులు, మహిళలు పోలీసుస్టేషన్ నుంచి నిర్మల్- భైంసా రహదారి వైపు నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో దిలావర్పూర్ రైతులతో కలెక్టర్ అభిలాష అభినవ్ చర్చలు జరిపారు.
ఈ ఘటనపై ప్రభుత్వానికి నివేదిక పంపామని.. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లామని గ్రామస్తులకు తెలియజేశారు కలెక్టర్. ఈ నేపథ్యంలో ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు తేల్చిచెప్పారు.
మూడు ప్రాంతాల్లోని ప్రజలు, రైతులు ఇథనాల్ పరిశ్రమతో వ్యవసాయ భూములు పనికి రాకుండా పోతాయని ఆందోళన చెందుతున్నారు. కృష్ణా, గోదావరి తీర ప్రాంతాల్లోనే ఇథనాల్ ఏర్పాటుతో కలుషిత నీరు నదిలో చేరి మత్స్య పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందని గంగపుత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరిశ్రమ ఏర్పాటులో ప్రభుత్వాలు స్థానిక ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేయకుండా అభివృద్ధి పేరుతో కుట్ర చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. బీ.ఆర్.ఎస్ అధికారంలో ఉన్నపుడు ఆందోళనకారులకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వటం… విపక్షంలోకి రాగానే గులాబీ దండు లోపాయికారిగా సహకరించటం గమనార్హం.