మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్రఫడ్నవిస్ అవడానికి అన్ని మార్గాలు క్లియర్ అయ్యాయి. అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తిరిగి తానే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బుధవారం ఆయన మీడియా ముందుకు వచ్చి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మీడియాతో షిండే మాట్లాడుతూ తను ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి శివసేన కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలిపారు. మీనిర్ణయానికి నేను ఏమాత్రం అడ్డుకాదని, ముఖ్యమంత్రిగా మీరు ఎవరిని ఎంపిక చేసినా మేమంతా శిరసావహిస్తామని మోడీకి చెప్పినట్ల తెలిపారు. ఇదే విషయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా ఫోన్ చేసి చెప్పినట్లు షిండే మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఏక్ నాథ్ షిండే మీడియా ముందుకు రావడానికి గంట ముందే మహారాష్ట్ర బీజేపీ ఓ లేఖ విడుదల చేసింది. ఏవత్ మహరాష్ట్ర బీజేపీ ఫడ్నవిస్ ను ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని ఆ లేఖలో పేర్కొనడం విశేషం