హైదరాబాద్లోని టప్పాచబుత్ర నటరాజ నగర్ ప్రాంతంలో నకిలీ మెహందీ తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. మెహందీలో ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలు ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులను అదుపులోకి తీసుకొని వాళ్లపై కేసులు నమోదు చేశారు.
టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు టప్పాచబుత్ర పోలీసులు సంయుక్తంగా ఓ ఇంటిపై దాడి నిర్వహించి నకిలీ కరాచీ మెహందీ ని పట్టుకున్నారు. యాసీన్, మోసిన్ అనే ఇద్దరు వ్యక్తులు నటరాజ్ నగర్ లో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ కరాచీ మహేంది తయారీ కేంద్రాన్ని నడిపిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో దాడులు చేసిన పోలీసులు నకిలీ మెహందీ తయారీ నిజమే అని నిర్థారించారు. సుమారు 70 కార్టూన్ల మెహందీను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ధర ఐదు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రంజాన్ పండుగ సమయంలో ఈ నకిలీ మెహందీ ని మార్కెట్లో అమ్మడానికి తయారుచేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ మెహందీని పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు.