పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు… భూపాల్రెడ్డి
బీఆర్ఎస్ పార్టీ మంగళవారం నల్లగొండలో తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరించారు. మంగళవారం మీరు నిర్వహించబోయే రైతు మహాధర్నాకు రాష్ట్రం నలుమూలల నంచి వేలాది కార్యకర్తలు హాజరవుతాయని తమకు నివేదికలు ఉన్నాయని… అంతమంది ఒక్కసారిగా క్లాక్ టవర్ సెంటర్కు వస్తే శాంతిభద్రతల సమస్యతో పాటు టాఫిక్కు తీవ్రంగా అంతరాయం కలిగే అవకాశాలు ఉన్నందున ధర్నాకు అనుమతి నిరాకరిస్తున్నట్లు నల్గొండ డీఎస్పీ బీఆర్ఎస్ నాయకుడు భువనగిరి దేవేందర్కు అఫిషియల్గా ఆర్డర్ జారీ చేశారు. అయితే తాము మాత్రం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో మంగళవారం ధర్నా నిర్వహించి తీరుతామని బీఆర్ఎస్ ప్రకటించింది. దాంతోపాటుగా పోలీసులు ధర్నాకు అనుమతి నిరాకరించడంపై హైకోర్టును ఆశ్రయించాలని కూడా బీఆర్ఎస్ నేతల సన్నద్దం అవుతున్నారు. గతంలో క్లాక్ టవర్ వేదికగా అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించిన చరిత్ర ఉందని ఇప్పుడు కొత్తగా అభ్యంతరాలు ఏంటని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లే పోలీసు బీఆర్ఎస్ ధర్నాకు అనుమతి ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాకు అనుమతి ఇవ్వకుంటే రేపటి నుంచి జరిగే గ్రామసభల వద్దే నిరసనలు నిర్వహిస్తామని బిఆరెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. నల్గొండ బీఆర్ఎస్ మాజీ ఎమ్మల్యే కంచర్ల భూపాల్రెడ్డి ధర్నాకి అనుమతి నిరాకరణపై స్పందిస్తూ తమకు అనుమతి ఇస్తామని చెప్పి ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేమని ఆర్డర్ ఇచ్చి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, డీఎస్పీ శివరాంరెడ్డిలు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మా పింక్ బుక్లో అన్నీ రాసుకుంటున్నామని మేము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా అన్నీ చెల్లిస్తామని భూపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.