చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చీ రాగానే ప్రజలకు బాదుడే బాదుడు మొదలైందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిదులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలన పక్కకు పెట్టి, సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతీ నెలా ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్ విమర్శించారు. చంద్రబాబు ఆడుతున్న అబద్దాలు, చేస్తున్న మోసాల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని జగన్మోహనరెడ్డి అన్నారు. మునుపెన్నడూ ఏ ప్రభుత్వంపై చూడని వ్యతిరేకత చంద్రబాబు ప్రభుత్వం పట్ల వచ్చిన ఆరునెలల్లోనే ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. ప్రజల్లో మన పట్ల ఉన్న విశ్వసనీయత, వ్యక్తిత్వం పట్ల ఉన్న గౌరవాల వల్లే మనం మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పారు. చంద్రబాబు అబద్దాలు, మోసాల విషయంలో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిసే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలిపారు. కరెంటు బిల్లులు చూస్తే ప్రజలకు షాక్ తగులుతోందని, ప్రజలపై 15 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపారని అన్నారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే గ్రామీణ రోడ్లపై కూడా ట్యాక్సులు వెయ్యడమే అని ఎద్దవా చేశారు. మనం కష్టపడి కట్టిన పోర్టులను చంద్రబాబు పప్పు బెల్లాలకు అమ్మేస్తున్నాడని జగన్ విమర్శించారు.
- Advertisement with us -