పాకిస్తాన్ తప్పుడు ప్రచారాలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ పై విదేశాంగ శాఖ ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో వివిధ ఆంశాల్ని అధికారులు వెల్లడించారు.
కల్నల్ సోఫియా ఖురేషి:
పాకిస్తాన్ పంజాబ్లో హైస్పీడ్ క్షిపణిని ప్రయోగించింది. పాక్.. భారత రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది. పాకిస్తాన్ సైన్యం భారత్ లోని సామాన్య ప్రజలపై దాడులు చేస్తోందన్నారు. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందన్నారు. భుజ్, భటిండాల్లోని వాయుసేన కేంద్రాలపై పాక్ క్షిపణులను ప్రయోగించగా విజయవంతంగా తిప్పికొట్టినట్టు వెల్లడించారు.
వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్:
పాకిస్తాన్ 26 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుందని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ వెల్లడించారు. శ్రీనగర్, అవంతిపుర, ఉధంపూర్లోని ఆసుపత్రి, పాఠశాల మౌలిక సదుపాయాలపై పాకిస్తాన్ దాడి చేసిందన్నారు. భారత వాయుసేన పాకిస్తాన్ లోని మిలిటరీ కేంద్రాలపైనే దాడులు చేసిందని, అయితే పాకిస్తాన్ ప్రభుత్వం సామాన్యులపై దాడులు చేస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తొందన్నారు.
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి
పాకిస్తాన్ చర్యలు రెచ్చగొట్టేవి, ఉద్రిక్తతలను పెంచేవిగా ఉన్నాయి. భారత్ పై దాడుల గురించి పాక్ వాదనలు అబద్ధాలు.. తప్పుడు సమాచారం ప్రచారం చేస్తుంది.
భారత్.. ఆఫ్ఘనిస్తాన్ను లక్ష్యంగా చేసుకున్నట్లు పాక్ తప్పుడు ప్రచారం చేస్తుంది..భారతీయ క్షిపణులు ఏవీ ఆఫ్ఘనిస్తాన్ను లక్ష్యంగా చేసుకోలేదు..ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు తెలుసు.. ఏ దేశం.. తమని లక్ష్యంగా చేసుకుంది.
పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాలపై భారత్ చేసిన దాడుల వివరాలకు సంబంధించిన వీడియోను అధికారులు విడుదల చేశారు.