ఛాంపియన్స్ ట్రోఫీ.. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈవెంట్ ఇది. కానీ పాకిస్థాన్ పుణ్యమా అని ఇప్పుడీ ట్రోఫీ మంచి జోష్ ఇవ్వకపోగా.. నీరసం తెప్పిస్తోంది. ఇప్పటి వరకు పాకిస్థాన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ మినహా మిగతా మ్యాచ్లన్ని చప్పగా సాగాయి. దీనికి తోడు వర్షం దెబ్బకు రెండు మ్యాచ్లు జరగకపోగా.. ఒక మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది. మరీ దారుణమైన విషయం ఏంటంటే.. స్టేడియాలల్లో సరైన డ్రైనేజీ సిస్టమ్ ఉండి ఉంటే.. ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగి ఉండేది. కానీ అలా జరగలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం పాకిస్థాన్ పోరాడింది. తమ దగ్గర వసతులకేం తక్కువ అంటూ భారత్తో పాటు.. ఐసీసీని దబాయించింది. కావాలంటే చేసి చూపిస్తామంది. కానీ పాకిస్థాన్ మాటలు కోటలు దాటగా.. చేతలు మాత్రం సున్నా. ఎందుకంటే లాహోర్లోని గడాఫీ స్టేడియం, కరాచీ నేషనల్ స్టేడియం, రావల్పిండి ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియాలను అప్గ్రేడ్ చేసింది పాకిస్థాన్. దీని కోసం రూ.1280 కోట్లను ఖర్చు చేసింది. కానీ ఏం లాభం స్టేడియాల్లో నిలిచిన నీటిని మాత్రం బయటికి పంపే వ్యవస్థ లేకుండా పోయింది.
29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్ను హోస్ట్ చేసేందుకు పాకిస్థాన్కు అవకాశం వచ్చింది. కానీ దానిని సద్వినియోగం చేసుకోలేక ఇప్పుడు క్రికెట్ అభిమానుల చేతుల్లో ట్రోల్స్కు గురవుతుంది. నిన్నటి మ్యాచ్లో వర్షం నిలిచింది. పిచ్ కూడా బాగుంది. కానీ ఔట్ ఫీల్డ్లో నిరు మాత్రం తొలిగిపోలేదు. ఆఖరికి టవల్స్ తీసుకొచ్చి వాటిని ముంచి బకెట్లలో నీటిని తీసే ప్రయత్నాలు చేశారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో PCBని ఓ ఆట ఆడుకుంటున్నారు ఫ్యాన్స్.
మరో దారుణమైన విషయం ఏంటంటే.. భారత్ ఫైనల్స్కు చేరుకోకపోతే ఇదే గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్ను నిర్వహించాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మ్యాచ్ కురిసి ఆగినా.. ఔట్ ఫిల్డ్లో నీరు నిలుస్తుంది కాబట్టి మ్యాచ్ను నిలిపివేయడం తప్ప.. మరో అవకాశమే లేదు.
నిజానికి పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది. కానీ ఆ నిజాన్ని అస్సలు అంగీకరించే పరిస్థితిలో లేదు పాకిస్థాన్. అంతేకాదు తన తాహతుకు మించి పనులు చేయాలని చూస్తూ భంగపడటం ఇప్పుడు అలవాటుగా మార్చుకుంది. దీంతో మరింత పీకల్లోతూ కష్టాల్లో పడుతుంది. ఇప్పుడీ ట్రోఫీ నిర్వహణనే చూసుకుంటే.. 12 వందల కోట్లు ఖర్చు చేసింది స్టేడియాలను అప్గ్రేడ్ చేయడానికి. కానీ ఏం లాభం. సరైన లైటింగ్ ఏర్పాటు చేయలేకపోయింది.హడావుడిగా పనులు చేయడం వల్ల క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. దీనికి తోడు ఇప్పుడు వరణుడి దెబ్బకు పాక్ పనితీరు ఎంత బాగుందో ప్రత్యక్షంగా కళ్లకు కనిపిస్తూనే ఉంది. మొత్తానికి పాక్ తనకు శక్తి లేకపోయినా గొప్పలకి పోయి ఛాంపియన్స్ ట్రోఫీని తలకెత్తుకుని అట్టర్ ఫ్లాప్ అయినట్టు కనిపిస్తోంది.