దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్రం ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బిల్లులపై కేంద్రం పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది. తాజాగా లోక్సభ బిజినెస్ జాబితా నుంచి రెండు బిల్లులను తొలగించడమే దీనికిసంకేతంగా నిలుస్తోంది. తొలుత ఈ నెల 16వ తేదీన లోక్సభ ముందుకు బిల్లులు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. ఆమేరకు లోక్సభ బిజినెస్ జాబితాలో కూడా అంశాలను పొందుపరిచారు. కేంద్ర మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ బిల్లు పెడతారని కేంద్రం పేర్కొంది. కానీ.. తాజాగా మార్పు చేసిన లోక్సభ బిజినెస్లో జమిలి ఎన్నికల బిల్లులు కనిపించడంలేదు. ఈ నెల 20వ తేదీతో పార్లమెంటు సమావేశాలు కూడా ముగుస్తాయి. తాజా పరిణామాల నేపథ్యంలో.. శుక్రవారంతో ముగిసే శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లులు పెట్టడంపై సందిగ్దత నెలకొంది.
లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికల అమలుకు పలు దశలున్నాయి. వీటి కోసం రాజ్యాంగంలో కొత్తగా 82ఎ అధికరణాన్ని చేర్చాల్సి ఉంటుంది. పార్లమెంటు పదవీ కాలంలో మార్పు కోసం.. 83వ అధికరణాన్ని, అసెంబ్లీల పదవీ కాలం సవరణకు.. 172వ అధికరణాన్ని, ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం కల్పించే.. 327వ అధికరణాన్ని సవరించాల్సిన అవసరం ఉంటుంది.
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే సిఫారసు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టిన కేంద్ర కేబినెట్.. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన రెండు బిల్లులకు ఈ నెల 12న ఆమోదం తెలిపింది. అయితే, ఈ సమావేశాల్లోనే వీటిని పార్లమెంటులో ప్రవేశపెడతారని అందరూ అనుకున్నారు. కానీ, తాజా పరిణామాలతో ఈఅంశం చర్చనీయాంశంగా మారింది.