- బంజారాహిల్స్ రోడ్ 12 నుంచి-
- -జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకూ రోడ్ వైడనింగ్ ప్రణాళికలు
- చాలా మంది ప్రముఖల ఇళ్ళకు మార్కింగ్లు
పోష్ లొకాలిటీలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రధాన రహదారుల్లో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ని తగ్గించేందుకు రోడ్డు విస్తరణ పనులకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్దం చేసింది. పెన్షన్ ఆఫీస్ సర్కిల్లో ఉన్న విరించి ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకూ దాదాపు ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు జీహెచ్ఎంసీ పూనుకుంది. విస్తరకు భూసేకరణ కోసం ఈ మార్గంలో ఉన్న పలు భవనాలకు మార్కింగ్ వేశారు జీహెచ్ఎంసీ సిబ్బంది. ఈ రహదారిలో ఉన్న మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి నివాసంతో పాటు సినీ హీరో నందమూరి బాలకృష్ణ నివాసానికి కూడా మార్కింగ్ చేశారు. జీహెచ్ఎంసీ వేసిన మార్కింగ్ ప్రకారం చూస్తే జానారెడ్డి తన నివాస స్ధలంలో దాదాపు ఆరు వందల గజాల స్ధలాన్ని కోల్పోనున్నారు. ఇక బాలకృష్ణ అయితే తన నివాసంలో ఐదు వందల గజాల వరకూ కోల్పోవాల్సి వస్తుంది. ఈ ఐదు కిలోమీటర్ల రహదారిలో నివసిస్తున్న ఇతర ప్రముఖులు రేణుకా చౌదరి, కేయీ.కృష్ణమూర్తి, సమరసింహారెడ్డి, షబ్బీర్ అలీ, అల్లు అర్జున్ మామ చంద్రశేఖరరెడ్డిల నివాసాలకు కూడా జీహెచ్ఎంసీ మార్కింగ్ చేసింది. విరించి ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకూ ఉన్న రహదారి ప్రస్తుతం 80 అడుగుల వెడల్పు ఉండగా దాన్న వంద అడుగులకు విస్తరించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరో పక్క జూబ్లీహిల్స్ లో ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు చుట్లూతా ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా శరవేగంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అయితే ఈ రహదారి పొడవునా అందరూ వీవీఐపీలే కావడంలో రహదారి విస్తరణ కోసం తమ ఇళ్ళ స్ధలాను వదులుకోవడానికి ఎంత వరకూ సహకరిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.