- ఈ బడ్జెట్ సమావేశాల్లో 62 బిల్లుల టేబిలింగ్
- 16 అత్యంత కీలకమైనవి
- వక్ఫ్, రైల్వేస్, ఇమ్మిగ్రేషన్ బిల్లులే కీలకం
- ఇమ్మిగ్రేషన్ పై కఠిన చట్టాలు
- అక్రమ వలసల నిరోధంపై గట్టి కసరత్తు
కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సెషన్ లో పార్లమెంటులో 62 కీలక బిల్లులు సభామోదం కోసం ప్రవేశ పెట్టనుంది. వీటిలో 16 బిల్లులు అత్యంత కీలకమైనవి. అందులో అక్రమ వలసదారుల నిషేధం 2025 బిల్లు ఒకటి. వక్ఫ్ ఆస్తుల నియంత్రణకు ఉద్దేశించిన వక్ఫ్ సవరణ బిల్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు తో పాటు వలస దారుల నిరోధక బిల్లు చాలా కీలకమైనది.
అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలస దారులందరినీ వెనక్కు వెళ్లి పోవాలని అధ్యక్షుడు ట్రంప్ కోరిన నేపధ్యంలో ఇమ్మిగ్రేషన్ అంశం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇక మనదేశంలో పార్లమెంటులో ప్రవేశ పెట్టే ఇమ్మిగ్రేషన్ బిల్లు ఎలా ఉండబోతోందన్న స్వరూప స్వభావాలు వెల్లడి కానప్పటికీ మన దేశంలో ప్రవేశించిన వలసదారులను నియంత్రించే విధంగా అయితే ఉండబోతోందన్నది సుస్పష్టం. వలసలకు సంబంధించి గతంలోనే మన దగ్గరున్న విదేశీయుల చట్టం1946, పాస్ పోర్టు ఎంట్రీ యాక్ట్ 1920, విదేశీయుల రిజిస్ట్రేషన్ యాక్ట్ 1939 వీటన్నింటి సారాన్ని సంగ్రహించి ఈసారి ఇమ్మిగ్రేషన్ బిల్లును రూపొందించారు. ఈ బిల్లును ఇతర బిల్లులతో కలసి టేబుల్ చేసినా కేబినెట్ దీనిని ఈ సారి ఆమోదిస్తుందా అన్నది చూడాలి. డ్రాఫ్ట్ నమూనాను కేబినెట్ ఇంకా చూడలేదు.
ఎన్నికల అజెండాగా అక్రమ వలసలు
మన దేశంలో ఈశాన్య భారతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్రమ వలసలు ఎలక్షన్ అజెండా అయి కూర్చుంటుంది. ప్రత్యేకించి బెంగాల్, జార్ఖండ్ లాంటి బీజేపి యేతర రాష్ట్రాల్లో అయితే మరీను. అక్రమ వలసలను నిషేధిస్తామని జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో విపరీతంగా చెప్పిన బీజేపి హేమంత్ సోరెన్ చేతిలో ఓటమిని చవిచూసింది.
ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల సందర్భంగానూ అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీలు, రోహింగ్యాలను ఓటర్ల లిస్టు నుంచి తొలగించేస్తోంది బీజేపి. దీనిపై ఆప్ ఈసీకి ఫిర్యాదు చేసినా అన్ని సక్రమంగానే జరుగుతున్నాయని ఈసీ సమాధానమిచ్చింది.
మన దేశంలో అక్రమ వలసల విషయంలో ఇంత కఠినంగా ఉన్న కేంద్రం మరి అమెరికాలో అక్రమ వలసల నిషేధం సమస్యని ఎలా నెత్తికెత్తుకుంటుందో… లక్షలాది మంది భారతీయుల విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది.