ఓ పారిశుధ్య కార్మికుడిక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది. రూ.34 కోట్లు పన్ను చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. వాస్తవానికి ఆ కార్మికుడికి వచ్చే నెలవారీ జీతం కేవలం రూ.15వేలు. దీంతో, ఏం చేయాలో దిక్కు తోచని ఆ కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఉత్తర ప్రదేశ్లో జరిగిందీ సంఘటన. ఆగ్రాకు చెందిన కరణ్ సింగ్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో పారిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కరణ్ సింగ్కు ఉన్నట్టుండి ఓ లేఖ వచ్చింది. అది ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసు. కరణ్ సింగ్ రూ.34 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ బకాయి ఉన్నాడని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో, కరణ్ సింగే కాదు.. అతని కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా షాకయ్యారు. వెంటనే వెళ్లి పోలీసులకు కాంప్లెయింట్ ఇచ్చారు.
తాను నేను నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తినని, నెలకు కేవలం రూ.15 వేలు మాత్రమే జీతం వస్తుందని, కానీ, తనకు రూ.34 కోట్లు కట్టాలంటూ ఇన్ కమ్ టాక్స్ వాళ్లు నోటీసు ఎందుకు పంపించారో అర్థం కావడం లేదని కరణ్ సింగ్ తెలిపాడు. తన పాన్ కార్డు ఎవరైనా దుర్వినియోగం చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశాడు. దీనిపై విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలటూ కరణ్ సింగ్.. పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.
కరణ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరణ్ సింగ్ పాన్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారా? లేదా ఆదాయపు పన్ను శాఖ అధికారులు పొరపాటుగా నోటీసు పంపించారా? అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. అయితే, ఇలాంటి పరిణామాలు గతంలో కూడా జరిగాయి. తమ వ్యక్తిగత సమాచారాన్ని ప్రజలు ఎవరికీ చెప్పొద్దని, రహస్యంగా దాచుకోవాలని సూచిస్తున్నారు.