తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా తీరొక్క పూలతో ఆలయాన్ని అలంకరించారు. దేవదువుడు వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వస్తున్న భక్తులతో తిరుమల జనసంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో తిరుమలలో శుక్రవారం వేకువజామున శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ ఏడాది ఈ నెల 19వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనానికి టీటీడీ అధికారులు సౌకర్యాలు కల్పించారు.
భక్తుల రద్దీ నేపథ్యంలో పది రోజుల పాటు ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది. ఈ 10 రోజుల పాటు కేవలం దర్శనం టికెట్, టోకెన్స్ కలిగిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. ఈ రోజు శుక్రవారం కావడంతో అర్చకులు శ్రీవారికీ ఏకాంతంగా అభిషేకాన్ని నిర్వహించారు.
పూజది కైంకర్యాలు ముగిసిన అనంతరం ఉదయం 4.30 గంటల నుంచి ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించారు. ఉదయం 8 గంటలకు సర్వదర్శనం ద్వారా సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించారు. ఉదయం 9 గంటలకు శ్రీదేవి,భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రధంపై ఆలయ తిరు విధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహన మండపంలో ఉత్సవ మూర్తుల దర్శనం భక్తులకు కల్పించారు.