తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశమవుతోంది. మూడు రోజుల క్రితం తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల క్యూలైన్లో తొక్కిసలాట సంఘటన, ఆ దుర్ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు పరిహారం చెల్లింపు తదితర అంశాలపై ఈ అత్యవసర సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. పరిహారం చెల్లింపునకు సంబంధించిన చెక్కులపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్న అనంతరం చెక్కులు రూపొందించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం మృతుల కుటుంబాలకు చెక్కులు ఇవ్వనుంది. శనివారం ఉదయం మృతుల కుటుంబ సభ్యులకు వాళ్ల ఇళ్లకే వెళ్లి చెక్కులు పంపిణీ చేయాలని టీటీడీ యోచిస్తోంది. అంటే.. శనివారం ఉదయానికల్లా మృతుల స్వస్థలాలకు టీటీడీ సభ్యుల బృందం వెళ్లాల్సి ఉంటుంది. ఈమేరకు అత్యవసర సమావేశం నిర్వహిస్తు్నారు. తిరుపతి టికెట్ల క్యూలైన్లలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించిన విషయ తెలిసిందే. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం తిరుమల పర్యటనలో ప్రకటించారు.
- Advertisement with us -