-
దేవినేని ఉమను ఆశ్రయించినా న్యాయం జరగలేదన్న బాధితురాలు
-
రాజకీయ నాయకులారా.. మహిళలతో ఆడుకోకండి అంటూ విజ్ఞప్తి
-
వేధింపులతో కూతురు విషం తాగిందని తానూ తాగుతున్నానన్న మహిళ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్లు చెప్పి తల్లీ కూతుళ్లు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. అంతేకాదు.. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావును ఆశ్రయించినా తమకు న్యాయం దక్కలేదని పేర్కొన్నారు. ఈ మేరకు వీడియో రికార్డ్ చేశారు తల్లీ కూతుళ్లు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విజయవాడ వాంబే కాలనీకి చెందిన ఓ మహిళ.. తన కూతురితో కలిసి బలవన్మరణానికి ప్రయత్నించింది. తమకు న్యాయం జరగాలని జనసేన ఆఫీసు చుట్టూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని బాధితురాలు వాపోయింది. తిరిగి తిరిగి అలసి పోయామని తన బాధను వెల్లగక్కింది. జనసేన పవన్ కల్యాణ్ మహిళలకు, అమ్మాయిలకు అండగా ఉంటానని, ఏదో చేస్తానని సభల్లో చెబుతుంటే.. తమకు న్యాయం జరుగుతుందని భావించామని, ఆయన చుట్టూ తిరిగామని, కానీ.. ఏమీ జరగదని, ఏమీ చేయరని అర్థమైందని ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు దేవినేని ఉమా మహేశ్వర్రావుకు మొర పెట్టుకున్నా.. తమ సమస్యను పరిష్కరించలేదని ఆరోపించింది.
విక్రాంత్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి, తన భర్త శివనాగరాజు, అత్త దుర్గ, మామ వెంకటేశ్వర్రావు, మరిది శివకృష్ణ కొంతకాలంగా తనను, తన పిల్లలను అత్యంత దారుణంగా వేధిస్తున్నారని ఆరోపించింది. అదనంగా పది లక్షలు కట్నం తేవాలని బెదిరిస్తున్నారని పేర్కొంది. నిత్యం వేధింపులు తప్పక పోవడంతో.. తన కూతురు విషం తాగిందని, తాను కూడా విషం తాగి చనిపోతున్నానని వీడియోలో చెప్పింది. ఎన్ని పోలీస్స్టేషన్లలో కాంప్లెయింట్ చేసినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయింది. ఏం చేసినా తమకు న్యాయం జరగలేదని.. ‘మీకు దండం పెడతా.. మాలాంటి ఆడవాళ్లతో ఆడుకోకండి. రాజకీయ నాయకులు అస్సలు ఆడుకోవద్దు’ అంటూ వీడియోలో వేడుకుంది.