ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తన అనుమతి లేకుండా నియోజకవర్గంలో కూల్చివేతలు ఎలా చేపడతారని అధికారులను నాగేందర్ అడ్డుకున్నారు. చింతల్బస్తీ షాదన్ కళాశాల ఎదురుగా బుధవారం హైడ్రా చేపట్టిన కూల్చివేతలను దానం అడ్డకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా కూలుస్తారని అధికారులపై మండిపడ్డారు. ఎక్కడి నుంచో బతకడానికి వచ్చినవాళ్లు మాపై దౌర్జన్యం చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలు తక్షణం ఆపకపోతే ఆందోళన చేస్తానని అధికారులను దానం నాగేందర్ హెచ్చరించారు. దావోస్ నుంచి సీయం రేవంత్ రెడ్డి వచ్చే వరకూ కూల్చివేతలు ఆపాలని, సీయం వచ్చిన తరువాత తాను మాట్లాడి సెటిల్ చేస్తానని అధికారులకు హుకుం జారీ చేశారు. వాస్తవానికి మొదటి నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రాను తీవ్రంగా వ్యతిరేకించారు. హైడ్రా చీఫ్ రంగనాథ్పైన పలు విమర్శలు చేశారు. దీంతో బహిరంగ విమర్శలు మానుకోవాలని సీయం దానంను హెచ్చరించారు. సీయం హెచ్చరికతో కొన్నాళ్ళు మౌనంగా ఉన్న నాగేందర్ తాజాగా మళ్ళీ హైడ్రాపై గళమెత్తారు. హైడ్రా వల్ల అంతా నష్టమే అంటూ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హైడ్రా బుధవారం చింతల్బస్తీలో కూల్చివేతలు చేపట్టడంతో అక్కడ ప్రత్యక్షమైన దానం నాగేందర్ కొతసేపు హల్చల్ చేశారు.