ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్కు పర్యటనకు రానున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ అధికారికంగా విడుదల అయింది.
మే 2వ తేదీన మోదీ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. అమరావతిలో పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ, రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సభకు 5 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన పూర్తి షెడ్యూల్:
మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రధాని మోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3:30 గంటలకు అమరావతి హెలిప్యాడ్కు చేరుకుంటారు.
హెలిప్యాడ్ నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు.
ఈ రోడ్ షో 15 నిమిషాల పాటు కొనసాగుతుంది.
3:45 నుంచి 4:00 గంటల వరకు ప్రధాని అమరావతి పెవిలియన్ను సందర్శిస్తారు.
సాయంత్రం 4:00 నుంచి 5:00 గంటల** వరకు అమరావతిలోని ప్రధాన వేదిక వద్ద **బహిరంగ సభ** నిర్వహించనున్నారు.
సభ ముగిసిన తర్వాత, రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రసంగిస్తారు.
అనంతరం, సాయంత్రం 5:10కి హెలికాప్టర్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
5:20 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరతారు.
ప్రధాని పర్యటన కోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా 20 మంది ప్రముఖులు ఆసీనులవుతారు. వీవీఐపీల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి 100 మందికి స్టేజీ మీద కూర్చునేలా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 5 లక్షల మంది వరకు సభకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు.. ఇబ్బందులు కలగకుండా.. 8 రహదారులు, 11 పార్కింగ్ స్థలాలు ప్రజల రాకపోకలకు సిద్ధం చేస్తున్నారు.
ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకోవడానికి ప్రత్యేకంగా రహదారులను రెడీ చేశారు. ఈ-11, ఈ-13, ఈ-15 రోడ్లు, సీడ్ యాక్సెస్ రోడ్ ద్వారా రాకపోకలు జరగనున్నాయి. మంగళగిరి నుంచి రెండు రహదారులు, తాడేపల్లి నుంచి ఒక రహదారి, వెస్టు బైపాస్ నుంచి ఒక రహదారి, ప్రకాశం బ్యారేజ్ నుంచి రెండు రహదారులు, తాడికొండ నుంచి ఒక రహదారి, హరిశ్చంద్రపురం నుంచి ఒక రహదారి ద్వారా ప్రజలు సభ ప్రాంగణానికి చేరుకోవచ్చు. ఈ మార్గాల్లో రోడ్ల మరమ్మతులు పూర్తిచేసేందుకు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ జామ్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వాహనాల రాకపోకల నిర్వహణ కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.