కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి మరీ ప్రమాదకరం – ఎంపీ అరవింద్
కేసీఆర్ కుటుంబం టెర్రరిస్టుల కంటే ప్రమాదకరమని… కేసీఆర్ కంటే రేవంత్ మరీ డేంజర్ అని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు ఆదివారం వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎంపీ అరవింద్ బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సర్వనాసనం చేసి ఏ మొహం పెట్టుకుని సభ నిర్వహిస్తారని ఎంపీ ప్రశ్నించారు. రెండేళ్లలో అంత తొందరగా కాళేశ్వరం పూర్తి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన నిలదీశారు. డీపీఆర్ అప్రూవల్ కాకుండా ప్రాజెక్టు ఒరిజనల్ లొకేషన్ మార్చి అంత తొందరగా ఎందుకు నిర్మించారు… డబ్బులు ఏమన్నా అవసరం ఏమన్నా వచ్చిందా అని అరవింద్ ఎద్దేవా చేశారు. 2019లో ప్రాజెక్ట్ మరమత్తులు చేసి ఉంటే మేడిగడ్డ ప్రాజెక్టు కూలేది కాదని ఎంపీ అభిప్రాయపడ్డారు. కాళేశ్వరంలో సీయం, సివిల్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు అందరూ కలిసే అవినీతికి పాల్పడ్డారని ఎంపీ అరవింద్ విమర్శించారు. అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్లులు కూడా కృంగిపోయే ప్రమాదం ఉందని నివేదికల్లో ఉందని, కల్వకుంట కుటుండం ప్రాజెక్టులను కనీసం ఇళ్ళు కట్టే విధంగా కూడా నిర్మించలేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఉన్న అధికారులను రేవంత్ రెడ్డి ఎందుకు కొనసాగిస్తున్నారని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. కేసీఆర్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే క్లోజ్ ఎవరూ లేరని 2018లో కేసీఆర్ చెప్పిన వాళ్లకే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ టిక్కెట్లు ఇచ్చారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు.