తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు.. ఏపీలోని పలు జిల్లాల్లో భూమి కంపించింది. ఆ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడా భూ కంపం సంభవిస్తోంది. దీంతో, జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భూకంప తీవ్రత పెరిగితే పరిస్థితి ఏంటన్న బెంగ జనాన్ని వెంటాడుతోంది.
ఇటీవలి కాలంలోనే ఏపీలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. బుధవారం రాత్రి పది గంటల యాభై నిమిషాల సమయంలో ఒకసారి, గురువారం తెల్లవాఉ జామున 4 గంటల 56 నిమిషాలకు మరోసారి ఇచ్చాపురం పరిసరాల్లో భూమి స్వల్పంగా కంపించింది. అయితే, ఈ ప్రాంతంలో తరచూ ఇలా జరుగుతోందంటున్నారు స్థానికులు. 2022లో జనవరి 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆరుసార్లు ఈ ప్రాంతంలో భూమి కంపించింది. గత యేడాది ఆగస్టులో కూడా ఇదే ప్రాంతంలో రెండు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి.