కృష్ణాజిల్లా గన్నవరంలో సోమవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాధాశ్రమంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి వేళ విద్యార్థులు నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఆశ్రమంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో విద్యార్థులు పరుగులు పెట్టారు. మంటలను గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై లోపల ఉన్న పిల్లలను హుటాహుటిన బయటకు తీసుకువచ్చారు.
అయితే, ఓ ఆరుగురు విద్యార్థులు ఒ గదిలో గాఢ నిద్రలో ఉన్నారు. మిగతావాళ్లందరినీ బయటకు తీసుకొచ్చినా వాళ్ల గురించి తెలియగానే.. సిబ్బంది. ఆ గది తలుపులు పగులగొట్టి లోపల ఉన్న ఆరుగురిని కూడా బయటకు తీసుకొచ్చారు. అయితే, ఆ ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో అనాథాశ్రమంలో మొత్తం 140 మంది విద్యార్థులున్నారు.
అనాథాశ్రమంలో అగ్నిప్రమాదం జరిగినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, ఈ అగ్ని ప్రమాదానికి కారణమేంటన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.