హైదరాబాద్ శివారులో మరో జాతీయ రహదారి భారీ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. నగరానికి పశ్చిమ వైపున ముంబై నేషనల్ హైవేపై ఆరు లైన్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని మియాపూర్ నుంచి సంగారెడ్డి జి్లలాకేంద్రం వరకు 30 కిలోమీటర్ల మేర రహదారిని ఆరులైన్లుగా విస్తరిస్తున్నారు. ఈ విస్తరణ పనులు వేగం అందుకున్నాయి.
అయితే, ఈ రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పటాన్చెరు దాటిన తర్వాత రుద్రారంలో వంద ఫీట్ల నేషనల్ హైవే విస్తరణ కోసం జరుగుతున్న పనుల్లో కాంట్రాక్టర్లు కనీస నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాత హైవే రోడ్డును తవ్వడం, అవసరమైనంత మేరకు ట్రాఫిక్ను మళ్లించే పనులపై అధికారులు పర్యవేక్షణ కరువవడంతో.. నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
వందల సంఖ్యలో వాహనాలు నిత్యం ట్రాపిక్ జామ్లో ఇరుక్కుంటున్నాయి. కొద్ది దూరానికే గంటకు పైగా సమయం పడుతోంది. ఇక, ఉదయం, సాయంత్రం వేళల్లో, రద్దీ సమయాల్లో మాత్రం కిలోమీటర్ల కొద్దీ ముంబై జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో, వాహన దారులు తీవ్ర నరకయాతన పడుతున్నారు.
ఒక్కోసారి పటాన్ చెరు నుంచి సంగారెడ్డి వెళ్లేందుకు మూడు గంటలకు పైగా సమయం పడుతోందంటే అతిశయోక్తి కాదు. ప్రధానంగా కర్నాటక, మహారాష్ట్ర వైపు నుంచి హైదరాబాద్కు రావాలంటే ఇదే ప్రధాన రహదారి కావడంతో జనం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక, ఎమర్జెన్సీ సమయాల్లో హైదరాబాద్లోని ఆసుపత్రులకు వెళ్లాలంటే అంబులెన్సులకు కూడా దారి దొరకడం లేదు. ట్రాఫిక్లో చిక్కుకుంటున్నాయి. అధికారులు ఈ రహదారి విస్తరణ పనులపై దృష్టి సారించి వాహన దారులకు నిత్య నరకం నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.