ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.. గురువారం ఉదయం బీజాపూర్- దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 22 మంది మావోలు హతమయ్యారు. ఒక జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు బీజాపూర్ పోలీసులు వెల్లడించారు.
బీజాపూర్ జిల్లాలో భారీగా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో గురువారం ఉదయం 7 గంటల నుంచి భద్రతా బలగాలు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో బీజాపూర్ – దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అండ్రి అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ చేపడుతుండగా.. ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 22 మంది మావోలు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు బీజాపూర్ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపారు. గడచిన ఆరు నెలలుగా ఆంధ్రా చత్తీస్ఘడ్ సరిహద్దులు, ఆంధ్రా ఒడిషా సరుహద్దులతో పాటు ఒడిషా చత్తీస్ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయన్న సమాచారంతో భద్రతా దళాలు నిత్యం భారీ స్ధాయిలో కూబింగ్ చేపడుతున్నాయి.