హైదరాబాద్ మహానగరం ఇప్పటికే ఊహించని రీతిలో విస్తరించింది. అయితే, రోజురోజుకూ పెరుగుతున్న జనాభా, హైదరాబాద్లో అందుబాటులోకి వస్తున్న అవకాశాలు, గ్లోబల్ స్థాయి కంపెనీల స్థాపన వంటి కారణాలతో మరింతగా విస్ఫోటనంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో నగరం విస్తరణపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలతో పాటు.. కొత్తగా ఫ్యూచర్ సిటీ పేరుతో ఫోర్త్ సిటీ నిర్మిస్తున్నారు. దాదాపు 30 వేల ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఫోర్త్ సిటీ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఇందులో భాగంగా.. హెచ్ఎండీఏ తరహాలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ అథారిటీకి సీఎం రేవంత్ రెడ్డి ఛైర్మన్గా వ్యవహరించనున్నారు.
ప్రస్తుత హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగు రోడ్డు మధ్య మెుత్తం 56 గ్రామాలతో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ అథారిటీ పరిధిలోకి వచ్చే ప్రాంతాలను పక్కా మాస్టర్ ప్లాన్ ప్రకారం అత్యద్భుతంగా డిజైన్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఎఫ్సీడీఏ పరిధిలోకి 56 గ్రామాలను తీసుకున్నారు. గతంలో ఈ 56 గ్రామాల్లోని కొన్ని గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలో ఉండగా.. తాజాగా ఎఫ్సీడీఏ పరిధిలో కలిపారు. ఔటర్ రింగ్రోడ్ దాటిన తర్వాత శ్రీశైలం నేషనల్ హైవే, నాగార్జున సాగర్ స్టేట్ హైవేల పరిధిలోని పలు గ్రామాలను సైతం ఈ సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పరిధిలోని శంషాబాద్, దాని పరిసర ప్రాంతాలు కూడా ఇప్పుడు ఎఫ్సీడీఏ పరిధిలో చేర్చారు. ఫ్యూచర్ సిటీ పేరుతో నిర్మిస్తున్న ఫోర్త్ సిటీ నిర్మాణంలో భాగంగా.. మీర్ఖాన్ పేట గ్రామంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ అండ్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మిస్తున్నారు. దీంతో పాటుగా.. అథారిటీ పరిధిలోని పలు హబ్లను కలిపి 12 జోన్లుగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలోనే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ క్లస్టర్లు, ఎకనామిక్ జోన్ అభివృద్ధి చేయనున్నారు. అథారిటీ పరిధిలోనే కాంప్రహెన్సివల్ మాస్టర్ ప్లాన్తో పాటు అన్ని ప్రాంతాలకు మల్టీ మోడల్ కనెక్టివిటీ, మోడరన్ అర్బన్ ఎమినిటీస్ కూడా కల్పించబోతున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కొత్తగా రేడియల్ రోడ్లు, మెట్రోరైల్ కనెక్టివిటీకి కూడా అవకాశం కల్పించనున్నారు. ఫ్యూచర్ సిటీ మెట్రోపై ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
ఫ్యూచర్ సిటీ అథారిటీ పరిధిలోకి వచ్చే ప్రాంతాలను పక్కా ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయనున్నారు. ఫోర్త్ సిటీని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిని ఐటీ, పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దాలని యోచిస్తోంది. హైదరాబాద్ నగరం విస్తరణ కూడా ఎక్కువగా అటువైపే ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు.హెచ్ఎండీఏ, టీజీఐఐసీలతో కలిసి మెట్రోరైలు విస్తరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఈ నగరం అభివృద్ధి చెందడంతో హైదరాబాద్లో ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయి. నగరంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రూపురేఖలు మారిపోనున్నాయి.