ప్రబంధక్లకు సూచనలు
భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు
విశ్వహిందూ పరిషత్తు ఆధ్వర్యంలో కేసరపల్లిలో ఆదివారం నిర్వహించనున్న హైందవ శంఖారావం బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిర్వహించాలని తలపెట్టిన హైందవ శంఖారావ కార్యక్రమాన్ని తొట్టతొలిగా ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటి కార్యక్రమం కాబట్టి వీహెచ్పీతో పాటు ఇతర సంఘ పరివారం, హిందూ సంఘాలన్నీ ఈ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నాయి. సభావేదిక, సాంస్కృతిక వేదికతో పాటు ఐదు బ్లాక్లలో యాభై గ్యాలరీలను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం పరిసరాల్లో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా కాషాయ జెండాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యఅతిథులుగా వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్కుమార్, అయోధ్య రామమందిరం ట్రస్టీ గోవింద్దేవ్ మహరాజ్, వీహెచ్పీ కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్ పరందే, జాయింట్ సెక్రటరీ కోటేశ్వరశర్మ దితరులతోపాటు రాష్ట్రంలో 150 మంది స్వామీజీలు పాల్గొననున్నారు. 30 ఎకరాలలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. 150 ఎకరాల్లో వాహనాల పార్కింగ్కు వీలు కల్పించారు. పార్కింగ్ నుంచి సభకు చేరుకునే మార్గంలో భోజన వసతి ఏర్పాటు చేశారు. ప్రతి ప్రాంగణంలో 50 వేల మందికి భోజన వసతి కల్పిస్తున్నారు. సభను 50 గ్యాలరీలుగా విభజించారు. మొత్తమ్మీద 3,500 మంది ప్రబంధకులు విధుల్లో ఉంటారు. ముందు రోజు వచ్చే వారికి ఉప్పులూరు రైల్వేస్టేషన్ వద్ద వసతి ఏర్పాటు చేశారు. 40 నుంచి 50 వేల మంది ఉండేలా ఏర్పాట్లు చేశారు. వేదికపై ధార్మిక సంస్థ ప్రతినిధులు, స్వామీజీలే ఉంటారు. రాజకీయ నాయకులు గ్యాలరీలకే పరిమితం కానున్నారు.
భద్రతా బలగాల మోహరింపు
కేసరపల్లి పరిసరాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. స్థానిక ఎస్ఎల్వీ సమీపంలోని సభా ప్రాంగణం, పరిసరాలను శుక్రవారం క్షుణ్నంగా తనిఖీలు చేపట్టి ముందస్తు గస్తీ నిర్వహించారు. ముగ్గురు ఎస్పీలు, ఆరుగురు అదనపు ఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 45 మంది సీఐలు, 112 మంది ఎస్సైలు, 2,195 ఏఎస్సై, హెచ్సీ, పీసీలు, 490 హోంగార్డు సిబ్బందిని మోహరించనున్నామని ఎస్పీ గంగాధరరావు వెల్లడించారు. అదనంగా మరో ఆరు స్పెషల్ పార్టీల్లో 90, ఏపీఎస్పీ 132 మందితో కలిపి మొత్తంగా 3087 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారని చెప్పారు.
ట్రాఫిక్ మళ్లింపు…
హైందవ శంఖారావ సభకు భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంఓల చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నారు. చెన్నై నుంచి విశాఖ వెళ్లే వాహనదారులు గుంటూరు-బుడంపాడు మీదుగా అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్జంక్షన్ వైపు వెళ్లేలా చర్యలు చేపట్టారు. బందరు నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలను హనుమాన్జంక్షన్, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ మీదుగా.. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వద్ద దారి మళ్లించనున్నారు