ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో ఆవిర్భవించిన బీఆర్ఎస్ 25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా ప్లీనరీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల సరిహద్దుల్లో ఏప్రిల్ 27వ తేదీన పార్టీ రజతోత్సవ మహాసభ నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎల్కతుర్తి సభతో పార్టీకి ప్రజల్లో ఉన్న పట్టును రుజువు చేయాలని నాయకత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. సభకు సుమారు పది లక్షల మంది కార్యకర్తలు వస్తారని పార్టీ అంచనా వేస్తోంది.
మొత్తం 1213 ఎకరాల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో 159 ఎకరాల్లో సభా ప్రాంగణం. 5 ఎకరాల విస్తీర్ణంలో సభా వేదిక ఉంటుంది. ఐదు వందల మంది కూర్చునేలా సభా వేదిక నిర్మాణమవుతోంది. సభకు వెనుకాలే 4 ఎకరాలు వీఐపీ పార్కింగ్కు కేటాయించారు. ఇక 150 ఎకరాల్లో పబ్లిక్, VIP, ప్రెస్ సహా ఉద్యమకారులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన స్థలాన్ని భోజన వసతి, పార్కింగ్ కోసం కేటాయించారు. ఎటువైపు నుంచి వచ్చే వాహనాలు అటువైపే పార్క్ చేసేలా.. ఐదు ప్రాంతాల్లో ఏర్పా్ట్లు చేస్తున్నారు.
సిల్వర్ జూబ్లీ సభకు ఖర్చు కూడా అధికంగా పెడుతోంది. ప్రతి నియోజకవర్గానికి 25 లక్షల రూపాయలు పార్టీ తరఫున చెక్కులు విడుదల చేశారు. ఈ అమౌంట్ దాదాపుగా రూ. 30 కోట్లు. దీంతోపాటు 1200 ఎకరాలను రైతుల దగ్గర లీజుకు తీసుకుంది పార్టీ. ఈ 1200 ఎకరాల్లో చదును చేయడం, బారికేడ్లు వేయడం, రోడ్లు వేయడం, స్టేజ్, గెస్ట్ ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఇలా కేవలం సభాస్థలం వద్ద మరొక 20 నుంచి 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 500 మంది ఆర్టిస్టులతో వాల్ రైటింగ్ నిర్వహిస్తుంది పార్టీ. ఏప్రిల్ 20వ తేదీన మొదలుపెట్టి వారం రోజులపాటు అంటే బహిరంగ సభ జరిగే 27 వరకు రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండాలు ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టించనుంది.
వీటితోపాటు పేపర్లు టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ లు కూడా.. వీటి కోసం మరొక 20 – 25 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. జన సమీకరణ కోసం ఇప్పటికే ఆర్టీసీకి రూ. 9 కోట్లు చెల్లించింది భారత రాష్ట్ర సమితి. వీటితోపాటు ప్రైవేటు వాహనాలు. మధ్యలో వారికి భోజనాలు, సభా స్థలం వద్ద పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ ప్యాకెట్లు, కూలర్లు ఇలా వీటన్నింటికీ మరో పాతి కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇలా గులాబీ బహిరంగ సభ కోసం దాదాపు రూ. 100 కోట్ల దాకా ఖర్చు పెట్టనుంది పార్టీ. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో జన సమీకరణ పరంగా చూసిన, ఖర్చుపరంగా చూసిన ఇదే భారీ బహిరంగ సభ.
తెలుగు రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలకు కేరాఫ్ భారత రాష్ట్ర సమితినే. ఉద్యమ కాలం నుంచి అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో కూర్చున్నా బహిరంగ సభలు నిర్వహించడంలో గులాబీ నేతల తీరు ప్రత్యేకం. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలోనే బహిరంగ సభలు నిర్వహిస్తే బీఆర్ఎస్ మాత్రం ఏడాదికి ఒకటి రెండు బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తోంది. మరోసారి గులాబీ సత్తా చాటేందుకు బీఆర్ఎస్ నాయకత్వం కసరత్తు చేస్తోంది.