- ఉగ్రవాదుల మత మౌఢ్యం విశ్వరూపం ఇదీ
- అమాయకులను మతం అడిగి మరీ కాల్చేశారు
- ఖురాన్ సూక్తులు చెప్పక పోతే ప్రాణం తీశారు
- పిల్లలు ఆడుకుంటుండగా, పెద్దలు భేల్ పురీ తింటుండగా
- అరగంటలో స్కెచ్ ఫినిష్.. సెక్యూరిటీ వచ్చే సరికి లేట్
- తూటాలు తగిలినా చాలా సేపు బతికే ఉన్న క్షతగాత్రులు
- వెంటనే సాయం అంది ఉంటే బతికేవారు
- బైసరన్ -పెహల్గాం రూట్ మరీ దారుణమైన రూట్
- ఇండస్ జలవనరుల ఒప్పందం నిలిపివేత
- అట్టారీ బోర్డర్ దగ్గర ఇంటిగ్రెటెడ్ చెక్ పోస్ట్ క్లోజ్
- ఇకపై పాక్ పౌరులకు నో ఎంట్రీ
- పాక్ హైకమిషన్ సిబ్బంది కుదింపు కూడా..
ఐదుగురు హంతకులు, మూడు ప్రదేశాలు, పది నిమిషాల హెవీ ఫైరింగ్.. ఇది ఉగ్రవాదులు పెహల్గాం నరమేధానికి వేసిన స్కెచ్..
బైసరన్ లోయలో ఉగ్రవాదులు మొత్తం అరగంటలోనే తమ కాల్పుల ప్రణాళికను అమలు జరిపారు. టూరిస్టుల రద్దీ ఎక్కువగా ఉందని తెలుసుకున్న ఉగ్రమూకలు తమ స్కెచ్ ను మూడు భాగాలుగా అమలు జరిపారని మన భద్రతా దళాల దర్యాప్తులో తేలింది. దాడిలో పాల్గొన్నది ఐదుగురు ఉగ్రవాదులు.పైన్ వృక్షాల సముదాయం నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన ఉగ్రవాదులు టూరిస్టులు ఎక్కువగా ఉన్న మూడు స్పాట్ లను ఎంపిక చేసుకున్నారు. వారంతా తుపాకులతో పాటు ఈ దారుణ ఘటనను రికార్డు చేయడానికి కెమెరాలను కూడా వెంట తెచ్చుకున్నారు.
తొలిసారి కాల్పుల శబ్దం వినిపించినది 1.50 నిమిషాలకు. అయితే ఈ కాల్పులు ఉగ్రవాదులు జరిపినవిగా టూరిస్టులు అంచనా వేయలేకపోయారు. వారు సైనిక దుస్తుల్లో ఉండటంతో వచ్చినది ఉగ్రవాదులని తేలడానికే కొంత సమయం పట్టింది. దుష్ట ముష్కరులు వచ్చే సమయానికి పిల్లలంతా ట్రాంపొలైన్ పై గెంతులు వేస్తుండగా, తల్లి దండ్రులు భేల్ పురి తింటూ అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఆసమయంలోనే మరణ మృదంగం తొలి అంకానికి ఉగ్రవాదులు నాంది పలికారు.
మతం అడిగి మరీ కాల్చారు…!
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఉగ్రవాదులు అమాయక టూరిస్టుల దగ్గరకొచ్చి వారి మతమేంటని ముందు ప్రశ్నించారు.ఆ తర్వాత ఖురాన్ పంక్తులు కొన్ని చెప్పమన్నారు. ఆపై కాల్చేశారు. తమ పని పూర్తి చేసుకున్న వెంటనే అదే పైన్ వృక్షాల పొదల్లోకి పారిపోయారు. దాడి జరిగిన అరగంట తర్వాత అంటే 2.30 తర్వాత మాత్రమే పోలీసులకు సమాచారమందింది.
పెహల్గాం- బైసరన్ లోయకు మధ్య రోడ్డు టూ వీలర్స్ కు కూడా అనువైనది కాదు. ఎత్తు పల్లాలతో, బురదమయంగా, రాళ్లు, రప్పలతో ఎగుడు దిగుడుగా వేగంగా నడిచేందుకు కూడా అనువైనది కాదు. ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలన్నా, గుర్రపు స్వారీ చేయాలన్నా కూడా మార్గం సుగమం అవడానికి ఇంకా ఏడాది సమయం పట్టే అవకాశముంది. బైసరన్ లోయ నుంచి క్షతగాత్రులను వెనక్కు తేవాలన్నామధ్యాహ్నం మూడు దాటాకే అక్కడ సేవలు లభిస్తాయి. దుండగుల తుపాకీ తూటాలకు బలైన వారు చాలా సేపు బతికే ఉన్నారని వారికి అత్యవసర వైద్యసేవలు అందించి ఉంటే బతికే ఉండేవారన్నది ప్రత్యక్ష సాక్షుల కథనం.
పాక్ తో సంబంధాలు కట్…
మొత్తం మీద ఈ ఘటనలో 25 మంది అమాయక టూరిస్టులు, ఒక కశ్మీరీ గుర్రపు స్వారీ ఆపరేటర్ చనిపోయారు.ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తం కావడంతో భద్రతా దళాల కేబినెట్ కమిటీ పాకిస్థాన్ పై కఠిన చర్యలకు సిద్ధపడుతోంది. ఇండస్ జల వనరుల ఒప్పందం అమలును నిలిపి వేసింది.అట్టారీ సరిహద్దుల్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును మూసివేశారు.సార్క్ వీసా ఎగ్జెంప్షన్ స్కీమ్ కింద పాక్ పౌరులెవరూ ఇకపై మన దేశంలోకి ప్రయాణించలేరు. మే ఒకటవ తేదీ నాటికి పాకిస్థాన్ హై కమిషన్ బలాన్ని 55 నుంచి 30 కి తగ్గించాలని కూడా నిర్ణయించారు.పెహల్గాం దాడికి నిరసనగా పాకిస్థాన్ ప్రభుత్వ ట్విట్టర్ అక్కౌంట్ ను కూడా మన దేశంలో ఓపెన్ కాకుండా బ్యాన్ చేశారు.