ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనంపై విరుచుకుపడ్డారు. బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది జవాన్లతో పాటు.. వాహనం డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.
ఛత్తీస్గఢ్లోని బీజపూర్జిల్లా భెద్రేకుట్రు రహదారిలో జవాన్ల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఈ ఐఈడీ పేలుళ్లకు పాల్పడ్డారు. ఐఈడీ పేలిన సమయంలో పోలీసుల వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నారు. 8 మంది జవాన్లతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. దంతెవాడ, నారాయణపూర్, బీజాపుర్ జిల్లాల జాయింట్ ఆపరేషన్ లో భాగంగా సుఖ్ జిల్లాకు జవాన్లు వెళ్తుండగా మావోయిస్టులు టార్గెట్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జవాన్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడు జరిగిన పరిసర ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ చేపట్టారు.