మానస సరోవర్ యాత్ర మళ్లీ ప్రారంభం కాబోతుంది. ఐదేళ్ల తర్వాత ఈ యాత్రను తిరిగి ప్రారంభించాలని భారత్, చైనాలు నిర్ణయించాయి. అంతేకాదు ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ఎంతో మంది భక్తులు మళ్లీ ఇప్పుడు మానస సరోవర్ యాత్రకు బయల్దేరేందుకు సిద్ధమవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.
నిజానికి చాలా మంది హిందూవులు ఈ ప్రాంతాన్ని శివుడు కొలువై ఉన్న ప్రాంతంగా భావిస్తారు. అందుకే అత్యంత ప్రమాదకరమని తెలిసినా ఇక్కడి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అయితే కరోనా కారణంగా 2020లో ఇరు దేశాలు ఈ పర్యటనను నిలిపివేశాయి. ఆ తర్వాత అదే ఏడాది గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ కారణంగా ఈ యాత్ర తిరిగి ప్రారంభం కాలేదు. ఈ యాత్రతో పాటు ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి.
అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితులు మారాయి. ఉద్రిక్తతలు తగ్గాయి. ఎప్పుడైతే రష్యా వేదికగా ఇరు దేశాధినేతలు కలుసుకొని చర్చలు జరిపారో.. అప్పటి నుంచి పరిస్థితుల్లో మార్పులు రావడం ప్రారంభమైంది. ఇప్పటికే ఇరు దేశాల సరిహద్దుల్లోని వివాదస్పద ప్రాంతాల నుంచి సైనికులు వెనక్కి వెళ్లిపోయారు.
ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు చైనాలో పర్యటించి వచ్చారు. అయితే ఏం చర్చలు జరిగాయన్నది ప్రపంచానికి తెలియలేదు. ప్రస్తుతం భారత విదేశాంగా కార్యదర్శి విక్రమ్ మిస్రీ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యి కీలక చర్చలు జరిపారు. ఈ చర్చల్లోనే మానస సరోవర్ యాత్ర, నేరుగా ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు నడిపే అంశాలపై చర్చ జరిగింది. వీటిపై ఇరు దేశాలు సానుకూలంగా స్పందించాయి. ఈ ఏడాది వేసవి నుంచి మానస సరోవర్ యాత్ర ప్రారంభం కానుంది.