వినియోగదారుల కమిషన్ తీర్పుతో దిగొచ్చిన టీటీడీ
తిరుమల వేంకటేశ్వరుడి సేవలో పాల్గొనడానికి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రెండు జంటలు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్ధితి ఎదురయ్యింది. వినయోగదారలు న్యాయస్ధానం కలగచేసుకుని భక్తులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో తిరుమల తిరుపతి దేశస్ధానం ట్రస్ట్ బోర్డు దిగొచ్చి భక్తులు కోరిన స్వామివారి సేవలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త శెట్టి చంద్రశేఖర్ ఆయన సతీమణి సుమిత్ర శెట్టి కుమారుడు హరీష్ శెట్టి అతని సతీమణి కోసం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి శుక్రవారం జరిగిఏ మేట్ చాట్ వస్త్ర సేవలో పాల్గొనడానికి 2008వ సంవత్సరం నవంబర్ 26న 21వేల 250 రూపాయల డీడీని తిరుమలలోని పేష్కార్ కార్యాలయానికి పంపించారు. అయితే సంవత్సరాలు గడుస్తున్నా తాము కోరుకున్న సేవను దర్శించుకునే అవకాశం దొరకకపోవడంతో చంద్రశేఖర్ శెట్టి టీటీడీకి అనేక లేఖలు రాశారు. ఎట్టకేలకు 2021 సెప్టెంబర్ 10 వ తేదీన మేల్ చాట్సేవలో పాల్గొనడానికి స్లాట్ బుకింగ్ అయ్యిందని కరోనా కారణంగా క్యాన్సిల్ చేశామని దాని బదులుగా బ్రేక్ దర్శనం ఇస్తామని చంద్రశేఖర్ కి సమాచారం అందించారు. అయితే మేట్ చాట్ వస్త్ర సేవ బదులు బ్రేక్ దర్శనం వినియోగించుకోవడనికి చంద్రశేఖర్ కుటుంబం అంగీకరించకుండా తమకు ముందుగా అనుకున్న సేవే కాలవాలని టీటీడీ ని కోరారు. అయితే దీనికి టీటీడీ అధికారులు అంగీకరించకపోవడంతో న్యాయం కోసం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించారు. చంద్రశేఖర్ శెట్టి పిటీషన్ని పరిశీలించిన వినియోగదారుల కమిషన్ నాలుగు రోజుల లోపల మేల్ చాట్ వస్త్ర సేవలో పాల్గొనే అవకాశం చంద్రశేఖర్ శెట్టి కుటుంబానికి కల్పించాలని ఆదేశించింది. లేని పక్షంలో 20 లక్షల రూపాయల జరిమానా చెల్లించాలని జడ్జి ఎం.అనురాధ తీర్పు ఇచ్చారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ టీటీడీ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించారు. ఈ వివాదాన్ని జిల్లా కమిషన్ లోనే పరిష్కరించుకోవాలని తేల్చి చెప్పడంతో తిరిగి జిల్లా కమిషన్ లో రివిజన్ వేశారు. జిల్లా కమిషణలో అంతకు ముందు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి చంద్రశేఖర్ శెట్టి కుటుంబానికి శ్రీవారి మేల్ చాట్ సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తారా లేక జరిమానలో యాభైశాతం పదిలక్షలు ప్రస్తుతం డిపాజిట్ చేస్తారా లేకపోతే జైలుకు వెళతారా అని జడ్జి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వచ్చే ఆగస్టు 14, 15 తేదీల్లో శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ అందుకు సంబంధించిన టిక్కెట్లను కూడా కోర్టు ద్వారా భక్తులకు అందజేశారు.